ఏపీజీవీబీలో అంతా గోప్యం!
ABN , First Publish Date - 2021-04-19T04:51:40+05:30 IST
తిలారు ఆర్.ఎస్. ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో అక్రమాలపై రీజనల్ కార్యాలయానికి చెందిన త్రిసభ్య కమిటీ ఆదివారం పరిశీలించింది.
అక్రమాలపై త్రిసభ్య కమిటీ పరిశీలన
తిలారు ఆర్.ఎస్.(జలుమూరు), ఏప్రిల్ 18: తిలారు ఆర్.ఎస్. ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో అక్రమాలపై రీజనల్ కార్యాలయానికి చెందిన త్రిసభ్య కమిటీ ఆదివారం పరిశీలించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కమిటీ సభ్యులు తనిఖీలు చేశారు. కార్యాలయం ప్రధాన గేటుకు తాళాలు వేసి.. అంతా గోప్యంగా దస్ర్తాలు పరిశీలించారు. వ్యక్తిగత ఖాతాల నుంచి రూ.లక్షల్లో సొమ్ము పక్కదారి పట్టగా, కమిటీ సభ్యులు గోప్యంగా పరిశీలన చేపట్టడంపై ఖాతాదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంత సొమ్ము స్వాహా అయింది? అక్రమాల వ్యవహారంలో ఎవరెవరికి సంబంధం ఉందనే విషయమై విలేకరులు ఆరా తీయగా.. దస్ర్తాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని కమిటీ సభ్యులు వెల్లడించారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేసి.. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిటీ సభ్యులు తమ పేర్లు కూడా చెప్పడానికి నిరాకరించారు. ఇదిలా ఉండగా, బ్యాంకు క్యాషియర్ గుప్త.. బ్యాంకు తాళాలు పట్టుకెళ్లిపోయి ఈ నెల 17 నుంచి పరారీలో ఉన్నాడని బ్యాంకు రీజనల్ మేనేజరు ఫిర్యాదు చేసినట్లు ఎస్.ఐ వై.కృష్ణ తెలిపారు.