అలా చేయకుంటే కోవిడ్-19 మూడో దశ మొదలవుతుంది: వైద్యశాఖ హెచ్చరిక
ABN , First Publish Date - 2020-03-27T01:32:09+05:30 IST
కరోనా వైరస్కు వ్యతిరేకంగా ప్రజలు, ప్రభుత్వం కలిసి సమష్టిగా పనిచేయకుంటే మున్ముందు ఘోరమైన పరిస్థితులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్కు వ్యతిరేకంగా ప్రజలు, ప్రభుత్వం కలిసి సమష్టిగా పనిచేయకుంటే మున్ముందు ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను విస్మరిస్తే ప్రమాదకరమైన మూడో దశ (కమ్యూనిటీ ట్రాన్సిమిషన్)కు వైరస్ చేరుకుంటుందని ఆ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు, మేము (ప్రభుత్వం) కలిసి సమష్టిగా పనిచేయకుంటే, మార్గదర్శకాలను పాటించకుంటే కోవిడ్-19 మూడో దశ ప్రారంభమవుతుంది. అయితే, మనం సామాజిక దూరం పాటిస్తే, కచ్చితమైన చికిత్స తీసుకుంటే అలా ఎప్పటికీ జరగదు’’ అని ఆయన పేర్కొన్నారు.
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని 21 రోజులపాటు లాక్డౌన్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. వైరస్ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క మందు ఇదేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలో 649 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42 తాజా కేసులు నమోదు కాగా, నాలుగు మరణాలు సంభవించినట్టు లవ్ అగర్వాల్ తెలిపారు.