ఉక్కుపిడికిలి.. 230వ రోజూ అమరావతి ఆందోళనలు

ABN , First Publish Date - 2020-08-04T16:36:56+05:30 IST

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు ఆమోదం

ఉక్కుపిడికిలి.. 230వ రోజూ అమరావతి ఆందోళనలు

వాడవాడలా దీక్షలు, నిరసన కార్యక్రమాలు

అమరావతిలో భారీ పోలీస్ బందోబస్తు

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పోరు హోరు..


గుంటూరు (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు ఆమోదం తెలపడంతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లుకు నిరసనగా అమరావతిలోని అన్ని గ్రామాల్లో సోమవారం రైతులు ఆందోళనలు చేపట్టారు. 230వ రోజూ నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ దీక్షా శిబిరాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నాడు జగన్‌ అమరావతికి వ్యతిరేకం కాదన్నారని గుర్తుచేశారు. రాజధానికి 30వేల ఎకరాలు ఉండాలని స్వయంగా తానే చెప్పారన్నారు. ఇప్పుడు మాటమార్చి మడమ తిప్పారన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మోదీ వేషధారణలో ఉన్న యువకుడికి వెలగపూడి మహిళలు రాఖీలు కట్టారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవీంద్ర తదితరులు తుళ్లూరు, వెలగపూడి, మందడం దీక్షా శిబిరాలను సందర్శించి రైతుల్లో భరోసా నింపారు. అమరావతిని కొనసాగించాల్సిందేనంటూ నేలపాడులో ఉద్దండ్రాయుని పాలేనికి చెందిన దళిత రైతు పూర్ణచంద్రరావు భారీ క్రేన్‌పైకి ఎక్కి నిరసనకు దిగాడు.


రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామ రైతులు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం రాజధాని డివిజన్‌ కమిటీ నేతలు మంగళగిరి మండలంలోని నిడమర్రు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, బేతపూడి గ్రామాల్లో ఆందోళన చేశారు. 


దళిత సంఘాల ముసుగులో అమరావతిలో అలజడులు సృష్టించటానికి కుట్ర జరుగుతోందని రాజధాని దళిత జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు నిరసనగా సోమవారం తుళ్లూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు.  కార్యక్రమంలో దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, చిలకా బసవయ్య, చేకుర్తి రవి, బేతపూడి సుధాకర్‌, మట్టుపల్లి గిరీష్‌, ముళ్లమూడి రవి తదితరులు పాల్గొన్నారు.


మరో రైతు మృతి

మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన మువ్వా ధనకుమార్‌ (52) సోమవారం మృతిచెందారు. గతంలో ఈయన సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. తనకున్న మూడు ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారు.

Updated Date - 2020-08-04T16:36:56+05:30 IST