ఇంట్లోనే తండ్రికి సమాధి కట్టాడు!
ABN , First Publish Date - 2020-09-03T13:53:47+05:30 IST
తండ్రికి కుమారుడు ఇంట్లోనే సమాధి నిర్మించి కలకలం సృష్టించాడు.
చెన్నై : పెరంబలూర్ జిల్లాలో అనారోగ్యంతో మరణించిన తండ్రికి కుమారుడు ఇంట్లోనే సమాధి నిర్మించి కలకలం సృష్టించాడు. జిల్లాలోని అమ్మాపాళయం సమీపంలో ఉన్న కలరంపట్టి గ్రామానికి చెందిన రైతు రామస్వామి (67) సోమవారం అనా రోగ్యంతో మరణించాడు. ఆయన మరణించే ముందు తన భౌతికకాయాన్ని ఇంట్లో సమాధి చేయాలని, ఇదే తన చివరి కోరిక అంటూ మొరపెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో, రామస్వామి మరణం గురించి ఈరోడ్లో ఉన్న ఆయన కుమారుడు, లారీ డ్రైవర్గా పనిచేస్తున్న బాలకృష్ణన్ (40)కి ఆయన బంధువులు సమాచారం అందించారు.
ఆయన వెంటనే స్వగ్రామానికి చేరుకొని తండ్రి మృతదేహాన్ని ఇంటి ప్రాంగణంలోనే ఖననం చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం గొయ్యి తవ్వుతుండగా చుట్టుపక్కల ఉన్న వారు అభ్యంతరం తెలిపారు. దీంతో రామస్వామి మృతదేహాన్ని ఇంటి లోపలే ఆయన కుటుంబసభ్యులు ఖననం చేశారు. దీనిపై అందిన సమాచారంతో పెరంబలూర్ తహసీల్దార్ పోలీసులతో ఆ గ్రామానికి చేరుకొని రామస్వామి మృతదేహాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసి, శ్మశానవాటికకు తరలించేందుకు యత్నించాడు. అయితే ఇందుకు కుటుంబసభ్యులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎంతచెప్పినా వారు వినిపించుకోకపోవడంతో బాలకృష్ణన్ సహా కుటుంబసభ్యులను అరెస్టు చేసి, రామస్వామి సమాధిని తొలగించి గ్రామంలోని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.