కోపంతో కూతురు తలుపు తీయడంలేదనుకున్నాడు.. కిటికీ తెరిచి చూడగా..
ABN , First Publish Date - 2020-06-29T16:23:41+05:30 IST
విజయనగరం జిల్లా కొత్తవలస డ్రైవర్స్ కాలనీలో ఓ జంట ఆదివారం..
జంట ఆత్మహత్య
యువతి వివాహిత.. కొంతకాలంగా భర్తకు దూరం
మరో యువకుడితో సహజీవనం
తండ్రి మందలించడంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య
కొత్తవలస(విశాఖపట్నం): విజయనగరం జిల్లా కొత్తవలస డ్రైవర్స్ కాలనీలో ఓ జంట ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి సీఐ గోవిందరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన అమ్మాయికి మూడేళ్ల కిందట అనకాపల్లికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య స్పర్థలు రావడంతో విడిపోయారు. తరువాత ఆమె కొత్తవలసకు చెందిన చరణ్ అనే వ్యక్తికి దగ్గరైంది. డ్రైవర్స్ కాలనీలో ఇల్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఆమె స్థానిక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నది.
ఇదిలా ఉండగా శనివారం ఉదయం ఆనందపురం నుంచి ఆమె తండ్రి వచ్చాడు. ఈ సమయంలో అక్కడ వున్న చరణ్ను చూసి ఇద్దర్నీ మందలించాడు. దీంతో చరణ్ బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత ఆమె తండ్రి కూడా పని వుందంటూ బయటకు వెళ్లాడు. ఆయన తిరిగి సాయంత్రం ఇంటికి రాగా తలుపులు మూసేసి ఉన్నాయి. తలుపు తట్టి నా లోపలి నుంచి స్పందన రాలేదు. తనపై కోపంతో కుమార్తె తలుపు తీయడంలేదని భావించి ఆయన ఆనందపురం వెళ్లిపోయాడు. తరువాత కుమార్తెకు ఫోన్ చేసినా తియ్యలేదు. ఆదివారం ఉదయం మరోసారి ఫోన్చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి కొత్తవలస వచ్చాడు. కిటికీ తెరిచి చూడగా ఇద్దరూ(చరణ్, యువతి) ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.