రబీకి పుష్కలంగా ఎరువులు
ABN , First Publish Date - 2021-10-26T06:47:57+05:30 IST
రబీ సీజనుకు సంబంధించి జిల్లాలో పంటల సాగుకోసం ఎరువులకు ఢోకా లేదు. అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయని, వచ్చే నెల మరిన్ని ఎరువులు దిగుమతి అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఎరువుల కొరత ఏర్పడుతుందని అన్నదాతలు ఆందోళనలు చెంది ముందస్తుగా అవసరానికి మించి కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు.
ఆందోళన వద్దంటున్న అధికారులు
నెల్లూరు(వ్యవసాయం), అక్టోబరు 25 : రబీ సీజనుకు సంబంధించి జిల్లాలో పంటల సాగుకోసం ఎరువులకు ఢోకా లేదు. అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయని, వచ్చే నెల మరిన్ని ఎరువులు దిగుమతి అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఎరువుల కొరత ఏర్పడుతుందని అన్నదాతలు ఆందోళనలు చెంది ముందస్తుగా అవసరానికి మించి కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు.
జిల్లాలో ఏటా రబీ సీజనులో దాదాపు 2.5లక్షల హెక్టార్లలో ప్రధాన పంట సాగవుతుందని అధికారుల అంచనా. అయితే ఈ రబీకి మాత్రం దాదాపు 3లక్షల హెక్టార్లకు ప్రణాళికలు రూపొందించారు. డీఏపీ 15వేల మెట్రిక్ టన్నులు(ఎంటీఎస్), యూరియా 1.10లక్షల ఎంటీఎస్, కాంప్లెక్స్ ఎరువులు 60వేల ఎంటీఎస్, ఎంవోపీ(పొటాష్) 15వేలు ఎంటీఎస్, ఎస్ఎస్పీ 10వేల ఎంటీఎస్లు అవసరం ఉంది. అక్టోబరు నెలలో డీఏపీ 3వేల ఎంటీఎస్, యూరియా 6500 ఎంటీఎస్, కాంప్లెక్స్ 12వేల ఎంటీఎస్, ఎంవోపీ 1400 ఎంటీఎస్, ఎస్ఎస్సీ 600 ఎంటీఎస్ అవసరం అవుతాయని ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇప్పటి వరకు అన్నదాతలు 2150 ఎంటీఎస్ డీఏపీ, 2100 ఎంటీఎస్ యూరియా, 3100 ఎంటీఎస్ కాంప్లెక్స్, 600 ఎంటీఎస్ ఎంవోపీ, 1050 ఎంటీఎస్ ఎస్ఎస్పీ ఎరువులను జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేశారు. ఇంకా 2వేల ఎంటీఎస్ల డీఏపీ, 14వేల ఎంటీఎస్ల యూరియా, 14వేల ఎంటీఎస్ల కాంప్లెక్స్, 2500 ఎంటీఎస్ల ఎంవోపీ, 4వేల ఎంటీఎస్ల ఎస్ఎస్పీ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారానే వీటిని అందిస్తున్నారు.