కుల వివక్షపై పోరాడాలి
ABN , First Publish Date - 2020-09-30T05:58:25+05:30 IST
కుల వివక్షపై పోరాడాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి అందె మంగ పిలుపునిచ్చారు. మంగళవారం
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి అందె మంగ
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 29: కుల వివక్షపై పోరాడాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి అందె మంగ పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఎల్ఐసీ కాలనీలో జ్యోతిరావుఫూలే సత్యశోధక్ 148వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. స్త్రీ సాధికారత సాధనకు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎందరో త్యాగధనులు పోరాటం చేశారని చెప్పారు. వారి బాటలో పయనిస్తూ దళిత, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మధ్యకాలంలో నిమ్నజాతి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ తీవ్రమైన దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడులను పట్టించుకోకుండా వేడుక చూస్తున్నాయని విమర్శించారు. దళిత, బడుగు, బలహీన వర్గాలపై దాడులు చేయడం బాధాకరమన్నారు. ఈ దాడులను ప్రతిఘటించేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పద్మ చంద్రశేఖర్, సామాజిక కార్యకర్త శ్రీమన్నారాయణ, పీఓడబ్ల్యూ నాయకురాలు జ్యోతి, అరుణ, పీడీఎస్యూ కార్యదర్శి రెడ్డి చరణ్, శ్రీకాంత్, అరుణోదయ కార్యదర్శి మల్లన్న తదితరులు పాల్గొన్నారు.