4.50 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఏమైంది..?
ABN , First Publish Date - 2021-07-22T16:05:53+05:30 IST
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న..
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శబరి
చిత్తూరు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా జగన్ ఇచ్చిన హామీ ఏమైందని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి ప్రశ్నించారు. గురువారం జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శివరాజ్ కుమార్ అధ్యక్షతన యువ మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న కొవిడ్ వ్యాక్సిన్లు సక్రమంగా వినియోగించడం లేదన్నారు. ఆలయాల ట్రస్టు బోర్డుల నియామకాల్లోనూ నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. అధికార పార్టీ అవినీతి, అక్రమాలు, అరాచకాలను ఎదుర్కొనేందుకు బీజేపీ, బీజేవైఎం సంయుక్త ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, బీజేవైఎం మీడియా సెల్ కన్వీనర్ దామోదర్రెడ్డి, కడప పార్లమెంట్ ఇన్చార్జి యామిని శేఖర్, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు ఉమామహేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు వేణుయాదవ్, మహేష్, నాయకులు ఈశ్వర్, దుర్గాప్రసాద్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.