ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-02-27T14:55:33+05:30 IST
ఢిల్లీ ప్రతాప్ నగర్లోని ఒక ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున 3.45 గంటలకు..
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రతాప్ నగర్లోని ఒక ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున 3.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో ఢిల్లీ అగ్నిమాపక దళం వెంటనే రంగంలోకి దిగింది. 18 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణలోనే ఉన్నారు. అయితే, సకాలంలో వారంతా అక్కడ్నించి బయట పడినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఒకరు గాయపడటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆస్తినష్టం, ప్రమాద కారణాలు తెలియవలసి ఉన్నాయి. అయితే, గ్యాస్ సిలెండర్ పేలి మంటలు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఫ్యాక్టరీలో కాస్మొటిక్స్, ఆట వస్తువులు, బ్యాగులు తయారు చేస్తుంటారు.