జాతీయ భద్రతా దళంలో తొలి కొవిడ్ మరణం!
ABN , First Publish Date - 2021-05-06T08:09:22+05:30 IST
జాతీయ భద్రతా దళంలో తొలి కరోనా మరణం నమోదైంది. ఎన్ఎస్జీ కో-ఆర్డినేషన్ గ్రూప్ కమాండర్ బీకే ఝా (53) కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు...
- గ్రూప్ కమాండర్ ఝా కన్నుమూత
న్యూఢిల్లీ, మే 5: జాతీయ భద్రతా దళంలో తొలి కరోనా మరణం నమోదైంది. ఎన్ఎస్జీ కో-ఆర్డినేషన్ గ్రూప్ కమాండర్ బీకే ఝా (53) కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అందుతున్న చికిత్సలో తీవ్ర అంతరాయం జరిగిందని, ఈ కారణంగానే ఝా చనిపోయారని ఎన్ఎస్జీ అధికారులు ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం ఝాకు కరోనా సోకడంతో గ్రేటర్ నోయిడాలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఝా బుధవారం ఉదయం మృతిచెందారు. మంగళవారం రాత్రి సీఏపీఎఫ్ ఆస్పత్రి ఐసీయూలోని వెంటిలేటర్ పనిచేయలేదు. దీంతో ఇతర ఏ ఆస్పత్రిలోనైనా వెంటిలేటర్ బెడ్ కోసం వెతకాలని వైద్యులు సూచించా రు. చాలా ఆలస్యం తర్వాత నోయిడాలోని మరో ఆస్పత్రిలో వెంటిలేటర్ బెడ్ దొరికింది. అయితే కార్డియాక్ అంబులెన్స్ దొరకడంలో ఆలస్యం జరిగింది. చివరికి అంబులెన్స్ దొరికి.. ఆయన్ను ఆస్పత్రికి చేర్చినా ఫలితం లేకపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కార్డియాక్ అరె్స్టతో ఝా తుదిశ్వాస విడిచారు.