భారత్-చైనా చర్చల్లో ‘పంచ సూత్రాల’పై దృష్టి : ఎంఈఏ
ABN , First Publish Date - 2020-10-01T01:55:24+05:30 IST
భారత్-చైనా దౌత్యపరమైన చర్చలు బుధవారం జరిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుత పరిస్థితిని
న్యూఢిల్లీ : భారత్-చైనా దౌత్యపరమైన చర్చలు బుధవారం జరిగాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుత పరిస్థితిని ఇరు పక్షాలు సమీక్షించాయి. సరిహద్దుల్లోని ఉద్రిక్తతలకు తెర దించడానికి ఇరు దేశాల రక్షణ మంత్రులు రష్యాలో జరిపిన చర్చల్లో రూపొందించిన ఐదు సూత్రాలపై ప్రధాన దృష్టితో ఈ చర్చలు జరిగాయి.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఎల్ఏసీ వెంబడి ప్రస్తుత పరిస్థితిని భారత్, చైనా సమీక్షించినట్లు తెలిపింది. ఆగస్టు 20న డబ్ల్యూఎంసీసీ సమావేశం అనంతరం జరిగిన పరిణామాలపై సవివరంగా చర్చించినట్లు పేర్కొంది. ఇరు దేశాల రక్షణ మంత్రులు జరిపిన చర్చల్లో రూపొందించిన 5 పాయింట్లపై ప్రధాన దృష్టితో తాజా చర్చలు జరిగినట్లు తెలిపింది.
సీనియర్ కమాండర్స్ తదుపరి (7వ రౌండ్) చర్చలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని ఇరు పక్షాలు అంగీకరించినట్లు తెలిపింది. త్వరగా, పూర్తిగా దళాల ఉపసంహరణ జరిగేందుకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.