కేరళకు అమిత్ షా హామీ

ABN , First Publish Date - 2021-10-17T18:05:30+05:30 IST

భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు

కేరళకు అమిత్ షా హామీ

న్యూఢిల్లీ : భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు సాధ్యమైన అన్ని విధాలుగా సాయం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట్ర దక్షిణ, మధ్య ప్రాంతాల్లో కురిసిన వర్షాలు సృష్టించిన పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. సహాయ కార్యక్రమాల కోసం ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించామన్నారు. 


అమిత్ షా ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులను తాము నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు. అవసరంలో ఉన్న ప్రజలకు సాధ్యమైన అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సాయపడుతుందని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో సాయపడేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు స్పందన దళం) సిబ్బందిని ఇప్పటికే పంపించామని చెప్పారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 


ఇదిలావుండగా, కేరళలో శనివారం కురిసిన వర్షాల కారణంగా సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఆదివారం ఉదయానికి వర్షాలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి రానున్న 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 


Updated Date - 2021-10-17T18:05:30+05:30 IST