టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులన్నింటికీ బిల్లులు చెల్లించేవరకు పోరాటం

ABN , First Publish Date - 2021-10-17T05:06:18+05:30 IST

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులన్నింటికీ బిల్లులు చెల్లించేవరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి అమరనాథరెడ్డి చెప్పారు.

టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులన్నింటికీ   బిల్లులు చెల్లించేవరకు పోరాటం
సమావేశంలో మాట్లాడుతున్న అమరనాథరెడ్డి తదితరులు

మాజీ మంత్రి అమరనాథరెడ్డి 


చిత్తూరు సిటీ, అక్టోబరు 16: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులన్నింటికీ బిల్లులు చెల్లించేవరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి అమరనాథరెడ్డి చెప్పారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో నీరు-చెట్టు, రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీ భవనాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు వంటి వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇవన్నీ టీడీపీ సానుభూతిపరులు చేశారన్న కారణంతో బిల్లులు చెల్లించుకుండా వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లను వేధించడం దారుణమన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించపోతే పనులు చేయడానికి ఎవరూ ముందుకు రారని అమరనాథరెడ్డి చెప్పారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు బిల్లులు రాని కాంట్రాక్టర్ల తరపున న్యాయపోరాటం చేస్తామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్‌ మాట్లాడుతూ బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చినా కొందరు ప్రభుత్వ అధికారులు వైసీపీ నేతల ప్రోద్బలంతో బిల్లులు మంజూరు చేయకుండా వేధిస్తున్నారని చెప్పారు. కొన్నిచోట్ల విడుదలైన బిల్లులను వైసీపీ నేతలు కాజేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2021-10-17T05:06:18+05:30 IST