మోదీ, బీజేపీ దేశాన్ని అమ్మేస్తున్నారు: Chinta mohan

ABN , First Publish Date - 2021-10-23T19:17:23+05:30 IST

దేశ పరిస్థితులు బాగా లేవని.. నిరుద్యోగం పెరిగిందని, ధరలు పెరిగాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు.

మోదీ, బీజేపీ దేశాన్ని అమ్మేస్తున్నారు: Chinta mohan

ఏలూరు: దేశ పరిస్థితులు బాగా లేవని.. నిరుద్యోగం పెరిగిందని,  ధరలు పెరిగాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇండో చైనా సరిహద్దుల్లో ఆందోళనగా ఉందని.. ఎప్పుడు ఏం  జరుగుతుందో తెలియదని తెలిపారు. ప్రధాని మోదీ, బీజేపీలు దేశాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మారని,  విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమ్మబోతున్నారని మండిపడ్డారు. ఏపీ రాష్ట్రం భ్రష్టు పట్టిపోతోందని అన్నారు. నిన్నా మొన్నా తిట్లు చూస్తే స్థాయి పడిపోయిందా అని అనిపిస్తోందని ఆయన తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వాడే భాషా బాగాలేదన్నారు. టీడీపీ నేత వాడినా పదం కూడా బాగాలేదని.. ఎన్నో పదాలు ఉండగా ఆ పదమే ఎందుకు వాడాలని ప్రశ్నించారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీలు ఇద్దరిదీ తప్పే అని అన్నారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు కుర్చీ కొరకు మ్యూజికల్ చైర్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.


రాష్ట్రాన్ని ఒక వర్గం 50 ఏళ్ళు,  మరో వర్గం 25 ఏళ్ళు పరిపాలించాయన్నారు. కాపులకు మూడు నాలుగేళ్ళు పరిపాలించే అవకాశం ఇవ్వవచ్చు కదా అని అన్నారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి కాపులను సీఎం చేయాలనేదే తన అభిప్రాయమని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని తాను ఒప్పిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండేళ్ళుగా 80 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు రాలేదన్నారు. దీపావళి పండుగలోగా అందరికీ స్కాలర్ షిప్‌లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నిధులను దారి మళ్లిస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు. 

Updated Date - 2021-10-23T19:17:23+05:30 IST