రెంటికీ చెడ్డారు.. అనిశ్చితితో ఉరకెత్తుతున్న మెట్ట పైర్లు
ABN , First Publish Date - 2020-09-19T19:29:13+05:30 IST
సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేవలం ఆరుతడికే నీరిస్తామన్న అధికారుల ప్రకటన వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కాలువకు ఎగువ భూముల్లో వరినాట్లు వేశారు. మేజర్ల నుంచి కొందరు అనధికారికంగా నీటిని వినియోగించుకుంటున్నారు.
వరిసాగుకు నీరు లేదంటున్న పాలకులు
అయోమయంగా సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి
దర్శి(ప్రకాశం): సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేవలం ఆరుతడికే నీరిస్తామన్న అధికారుల ప్రకటన వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కాలువకు ఎగువ భూముల్లో వరినాట్లు వేశారు. మేజర్ల నుంచి కొందరు అనధికారికంగా నీటిని వినియోగించుకుంటున్నారు. వాటి పక్కన ఉన్న పొలాల్లో ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన కంది, సజ్జ పైర్లు ఉరకెత్తుతున్నాయి. ఆరుతడికి ఇచ్చిన నీరు పొలాలకు చేరడం, ఇటీవల భారీవర్షాలు కురవడంతో కొన్నిచోట్ల మిర్చి కూడా నీట మునిగింది. దీంతో రైతుల పరిస్థితి రెంటీకి చెడ్డ రేవడిలా మారింది. సాగర్ జలాలు 20 రోజులుగా సరఫరా అవుతున్నాయి. బోర్ల కింద నారు పోసిన రైతులు మేజర్ల మొదట ఉన్న భూముల్లో ఇప్పటికే వరినాట్లు వేశారు.
మరికొందరు రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ భూములకు ఆనుకొని ఉన్న పొలాల్లో వేసిన కంది, సజ్జ పైర్లు ఉరకెత్తి దెబ్బతిన్నాయి. కందిపైరు తొలగించి వరిసాగు చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ మా గాణికి నీరు లేదని చెప్పటంతో ఇబ్బందిపడతామని అన్నదాతలు ఆందోళనలు చెందుతున్నారు. సాగుచేసిన కంది, సజ్జ పంట దశకు చేరింది. సాగర్జలాలు విడుదల చేయటంతో ఉరకెత్తి ఎందుకూ పనికి రాకుండాపోయాయి. రైతులు వేలాది రూపాయల పెట్టుబడులు నష్టపోతున్నారు. దాన్ని పూడ్చుకునేందుకు వరి సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం మాగాణికి నీరు లేదని చెప్పటంతో ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు.