రైతుల ప్రయోజనమే లక్ష్యం
ABN , First Publish Date - 2021-01-21T05:37:47+05:30 IST
రైతుల ప్రయోజనమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అధికారులు అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి అన్నారు.
- రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారుడు కృష్ణారెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్), జనవరి 20: రైతుల ప్రయోజనమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అధికారులు అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన కర్నూలు మార్కెట్ యార్డులో కొనుగోళ్లను పరిశీలించారు. వెల్దుర్తి మండలానికి చెందిన రైతుల వద్దకెళ్లి గిట్టుబాటు ధర అందుతుందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు కమిషన్ ఏజెంట్ల నుంచి తక్కువ వడ్డీకి అప్పులు అందించే లా అధికారులు కృషి చేయాలని కోరారు. బ్యాంకుల ద్వారా ప్రభుత్వం సున్నా వడ్డీకి రుణం అందించాలని ఆదేశించిందని, అర్హులైన రైతులందరికీ రుణం అందేలా అధికారులు దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
మార్కెట్ యార్డుల నిర్వీర్యాన్ని అడ్డుకోండి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తా యని, ఈ ప్రమాదాన్ని అడ్డుకోవాలని మార్కెట్ యార్డుల ఉద్యోగుల సం క్షేమ సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు రాష్ట్ర వ్యవసాయాశాఖ సలహాదారుడు కృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వ్యాపారుల నుంచి ఇప్పటిదాకా సెస్సు రూపంలో అందుతున్న ఆదాయం కేంద్ర ప్రభుత్వ చట్టాల వల్ల పూర్తిగా నిలిచిపోతుందని అన్నారు.
రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాం
రైతుల కష్టాలను దూరం చేసి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సం క్షేమ పథకాలను అమ లు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవా రం కలెక్టరేట్లోని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గత మూడు రోజులుగా జిల్లాలోని ఆలూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, కల్లూరు మండలాల్లోని రైతు భరోసా కేంద్రాలను, మార్కెట్ యార్డులను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నట్లు వివరించారు. పత్తికొండ, ఆదోని ప్రాంతాల్లో టమోటా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఉల్లి అరటి, మొదలగు పంట ఉత్పత్తులను ఎక్కువ రోజు నిల్వ ఉంచేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు అవసరం గురించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షుడు వంగాలు భరత్ రెడ్డి, జేడీ ఉమామహేశ్వరమ్మ, డిప్యూటీ డైరెక్టర్లు బోసుబాబు, రామ్నాయక్, ఏడీఏలు విజయశంకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస సురేష్ పాల్గొన్నారు.