గురుకులాల్లో ఉద్యోగాల పేరిట మోసం
ABN , First Publish Date - 2020-09-20T07:25:21+05:30 IST
ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు...
గుట్టు రట్టు చేసిన పోలీసులు
ముగ్గురి అరెస్టు
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 19: ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడి ్డపేట పోలీస్ స్టేషన్లో సీఐ బన్సీలాల్ వివ రాలు వెల్లడించారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన మాలోతు రాంచంద్రం, హైదరాబాద్లోని సుచిత్ర ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకురాలు ఠాగూర్ సుజాత, ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్తండాలోని భూక్య దేవీలాల్ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్తండాకు చెందిన దరావత్ రజితకు గురుకులంలో బ్యుటీషియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒకేషనల్ కోర్సు ఉద్యోగం ఇప్పిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన మాలోతు రాంచంద్రం, ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్తండాకు చెందిన భూక్య దేవీలాల్ రూ.2.45 లక్షల నగదు తీసుకున్నారు. రాంచంద్రంకు పరిచయమున్న హైదరాబాద్లోని సుచిత్ర ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకురాలు ఠాగూర్ సుజాత ద్వారా అపాయింట్మెంట్ లెటర్ అందించారు. 2019 మే నెలలో మెదక్ జిల్లాలోని టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో ఒకేషనల్ కోర్సులో శిక్షకురాలిగా నియమించారు. మూడు నెలల అనంతరం వేతనం ఇవ్వకపోవడంతో రామచంద్రం, సుజాతను రజిత నిలదీసింది. తిరిగి 2019 ఆగస్టులో ఆమెకు మరో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియమించారు. అక్కడ నాలుగు నెలలు పనిచేసినా జీతం ఇవ్వకపోవడంతో అనుమానించిన బాధితురాలు రజిత గత నెల 26న ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలోని పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. నిందితులు రామచంద్రం, దేవీలాల్ను అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్లోని సుచిత్ర ఎడ్యుకేషన్ సొసైటీలో సోదాలు జరిపి పలు పత్రాలతోపాటు సుజాతను పట్టుకున్నారు. రాష్ట్రంలోని మంచిర్యాల, కొమురంభీం, వరంగల్, నిర్మల్, భూపాలపల్లి, వికారాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 40 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని దందా సాగిం చినట్లు విచారణలో తేలిందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 21 మంది నిరుద్యోగుల వద్ద రూ.36 లక్షలు వసూలు చేశారని సీఐ వివరించారు. నిందితులు రామచంద్రం, సుజాత, దేవీలాల్ను రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.