‘మఫ్లర్ మ్యాన్’‌కు ఫుల్ పవర్స్ ఇచ్చిన కేంద్రం

ABN , First Publish Date - 2020-03-30T19:24:14+05:30 IST

అధికారాల విషయంలో ఎప్పుడూ ఉప్పూ, నిప్పులా ఉండే కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం, ఈ విపత్కర పరిస్థితుల్లో

‘మఫ్లర్ మ్యాన్’‌కు ఫుల్ పవర్స్ ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ : అధికారాల విషయంలో ఎప్పుడూ ఉప్పూ, నిప్పులా ఉండే కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం, ఈ విపత్కర పరిస్థితుల్లో మాత్రం చాలా పరిణతితో వ్యవహరిస్తున్నారు. ‘వలస కూలీల విషయంలో మీకు పూర్తి అధికారాలను ఇస్తున్నాం’’ అని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు. ‘‘లాక్‌డౌన్ విషయంలో కావల్సిన అన్ని అధికారాలను మీకు ఇస్తున్నాం. మీరు సమర్థవంతంగా అమలు చేయండి’’ అని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లేఖలో స్పష్టం చేశారు.


అంతేకాకుండా వలస కార్మికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాలని, వారి పట్ల మానవతా హృదయంతో మసులు కోవాలని, అవసరమైన వారిని ప్రభుత్వం నడుపుతున్న షెల్టర్లలోకి తరలించాలని ఎల్జీ కేజ్రీవాల్ సర్కారును ఆదేశించారు. అంతేకాకుండా లాక్‌డౌన్ నడుస్తున్నా సరే, ఆయా యాజమాన్యాలు కార్మికులకు ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించేలా చూడాలని అనిల్ బైజల్ లేఖలో ప్రభుత్వానికి సూచించారు. వీటితో పాటు వలస కూలీలు భారీ సంఖ్యలో రాజధాని నుంచి స్వస్థలాలకు వెళ్లడంపై కూడా ఎల్జీ ఆ లేఖలో ప్రస్తావించారు. వెంటనే రాష్ట్ర సరిహద్దులను మూసేసి, వారిని కట్టడి చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వలస కూలీలకు అవసరమైన సౌకర్యాలు కూడా సమకూర్చాలని ఆదేశించారు.


వలస కూలీలు కుప్పలు తెప్పలుగా వలస వెళ్లడంపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలోనే వలస కూలీల ఆరోగ్యంపై వీరిద్దరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వలస కూలీలను అనుమతించొద్దని యూపీ, పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులను ఆదేశించారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. 

Updated Date - 2020-03-30T19:24:14+05:30 IST