'పెరటితోట'లో మెజారిటీ ఏంటి?.. పైలట్ వర్గీయుల విసుర్లు

ABN , First Publish Date - 2020-07-14T00:27:46+05:30 IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్‌పీ సమావేశానంతరం విక్టరీ సంకేతాలివ్వడాన్ని..

'పెరటితోట'లో మెజారిటీ ఏంటి?.. పైలట్ వర్గీయుల విసుర్లు

న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్‌పీ సమావేశానంతరం విక్టరీ సంకేతాలివ్వడాన్ని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గీయులు తేలిగ్గా కొట్టిపారేశారు. గెహ్లాట్‌కు అవసరమైన సంఖ్యాబలం లేదని, మెజారిటీ నిరూపించుకోవడానికి 'పెరటితోట' సరైన వేదిక కాదని అన్నారు. అందుకు అసెంబ్లీనే సరైన వేదికని పేర్కొన్నారు. గెహ్లాట్‌కు తగినంత సంఖ్యాబలం ఉంటే సమావేశానంతరం నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లకుండా హోటల్‌కు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. పైలట్ బీజేపీలో చేరడం లేదని కూడా ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.


దీనికి ముందు, ఆదివారం ఉదయం సీఎల్‌పీ సమావేశాన్ని తన నివాసంలో అశోక్ గెహ్లాట్ ఏర్పాటు చేశారు. 107 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గెహ్లాట్‌కే తమ మద్దతని, పార్టీ వ్యతిరేకులపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానం కూడా చేశారు. అనంతరం విక్టరీ సంకేతాలిచ్చిన నేతలు, అటునుంచి అటే బస్సుల్లో రిసార్ట్‌కు బయలుదేరారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఒక బస్సులో గెహ్లాట్ కూడా బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2020-07-14T00:27:46+05:30 IST