మళ్లీ ఉప్పూ నిప్పుగా మారిన సచిన్ పైలెట్, సీఎం గెహ్లాట్

ABN , First Publish Date - 2020-06-07T19:43:15+05:30 IST

మళ్లీ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాదు... పరోక్షంగా పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్

మళ్లీ ఉప్పూ నిప్పుగా మారిన సచిన్ పైలెట్, సీఎం గెహ్లాట్

రాజస్థాన్ : మళ్లీ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాదు... పరోక్షంగా పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రెండోతరం నేతలు, యువ నేతలపై కూడా విరుచుకుపడ్డారు. యువనేతలు ఏమాత్రం కార్యక్షేత్రంలో పనిచేయడం లేదని... అయినా సరే.. హైకమాండ్ వారిని కేంద్ర మంత్రులు, పీసీసీ అధ్యక్షులను చేసేస్తోందని మండిపడ్డారు.


అయితే ఎవరి పేరెత్తకుండానే అన్యాపదేశంగా సచిన్ పైలెట్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అందరూ భావిస్తున్నారు. ‘‘మేము రాజకీయాల్లోకి ప్రవేశించిన సమయంలో రిజర్వేషన్లు లేకుండానే రైళ్లలో ప్రయాణం చేసేవాళ్లం. కిందనే పడుకునేవారం. తరచూ గ్రామాల్లో పర్యటించేవాళ్లం. సైకిళ్లపై తిరిగేవాళ్లం. అయితే ఇప్పటి తరం నేతలు మాత్రం ఇలాంటి కష్టాలు లేకుండానే అమాంతం పైకి ఎదిగిపోతున్నారు. వాళ్ల తప్పేం కాదు కానీ... అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి.’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


అయితే... సచిన్ పైలెట్‌పై అన్యాపదేశంగా విరుచుకుపడ్డా... ఆయనతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని గెహ్లాట్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి, కలిసి పనిచేస్తున్నామని, ప్రతిపక్ష బీజేపీ తమ మధ్య పొరపొచ్చాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో కూడా సచిన్ పైలెట్‌కు, సీఎం గెహ్లాట్ మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే.


ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.... వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెట్టేయడం ఏమాత్రం భావ్యం కాదని గతంలో కూడా సీఎం గెహ్లాట్‌ను పైలెట్ ఇరకాటంలోకి నెట్టేశారు. ఇలా... ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలకు దిగి చివరికి పంచాయితీ సోనియా గాంధీ  వద్దకు చేరింది. కొన్నాళ్ల పాటూ సర్దుకున్నట్లు ఉన్నా.... మళ్లీ ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. 

Updated Date - 2020-06-07T19:43:15+05:30 IST