ఖాళీ సిలెండర్ తెండి... ఆక్సిజన్ తీసుకెళ్లండి.... మున్సిపల్ కార్పొరేషన్ కూపన్ల పంపిణీ!
ABN , First Publish Date - 2021-05-05T11:18:45+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్లోని...
ఘజియాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో పారిశుద్ధ్య పనులను నిరంతరాయంగా చేపడుతోంది. అలాగే మునిసిపల్ కమిషనర్ మహేంద్ర సింగ్ తన్వర్ నగరంలో ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఆక్సిజన్ సిలెండర్ల కోసం కూపన్ పద్దతిని ప్రవేశపెట్టారు. ఈ కూపన్ ఆధారంగా ఆక్సిజన్ అందించనున్నారు.
హోంఐసోలేషన్లో ఉన్న కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలెండర్లు అందించనున్నారు. ఘజియాబాద్ప్రాంతవాసులు ఈ కూపన్ ద్వారా ఖాళీ సిలెండర్లు ఇచ్చి, అందుకు బదులుగా ఆక్సిజన్ సిలెండర్లు పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆక్సిజన్ సిలెండర్ల కూపన్లు పంపిణీ చేస్తున్నారు. నగరంలో ఆక్సిజన్కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, రద్దీని నివారించేందుకు ఐదు ప్రదేశాలలో ఆక్సిజన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హోం ఐసోలేషన్లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ అందించడమే కాకుండా, నగర ఆసుపత్రులలో కూడా తగిన మొత్తంలో ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు నగర కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.