మేళతాళాలతో ఈ యువతికి అపూర్వ స్వాగతం.. ఇంతకీ ఈమె ఎవరో.. అసలు కథేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-08-03T01:06:00+05:30 IST

ఆ అమ్మాయి అలా బస్సు దిగి ఊర్లో అడుగు పెట్టింది. అంతే మేళతాళాలు, రంగులు, పూలు చల్లి ఆమెకు ఘన స్వాగతం పలికారు గ్రామస్థులు.

మేళతాళాలతో ఈ యువతికి అపూర్వ స్వాగతం.. ఇంతకీ ఈమె ఎవరో.. అసలు కథేంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ అమ్మాయి అలా బస్సు దిగి ఊర్లో అడుగు పెట్టింది. అంతే మేళతాళాలు, రంగులు, పూలు చల్లి ఆమెకు ఘన స్వాగతం పలికారు గ్రామస్థులు. ఆమె మెడలో పూలమాలలు వేసి మెచ్చుకున్నారు. డప్పు కొడుతూ అంగరంగ వైభవంగా ఆమెను ఆహ్వానించారు. ఆమేమీ ఆ ఏరియాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ కాదు. ఆ గ్రామంలో పుట్టి పెరిగిన కూతురు. మరి ఆమెకు ఇంతటి భారీ ఆహ్వానం ఎందుకు? ఆ విషయం తెలియాలంటే ఇది చదవాల్సిందే. 


భారత్-పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్న బాడ్మేర్ అనే గ్రామం. దీన్ని గతంలో ‘ఆడపిల్లల స్మశానం’ అని పిలిచేవారు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయి పేరు ప్యారీ చౌధరీ. ఆమె తండ్రి కిస్తూరా రామ్.. గతంలో భారతీయ సైన్యానికి పనిచేశాడు. 47 ఆర్మీ రెజిమెంట్‌లో సుబేదార్‌గా రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఆ సుబేదార్ కుమార్తె ప్యారీ.. ఏకంగా లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం సాధించింది. మెడికల్ విభాగంలో ఆమె ఈ ఉద్యోగం పొందడం పట్ల బార్మేడ్ ఊర ఊరంతా హర్షం వ్యక్తం చేసింది. ఆమెకు మేళతాళాలతో స్వాగతం పలికి తమ సంతోషాన్ని అందరికీ తెలిసేలా చేసింది.


‘‘నేను పని చేసిన హోదా కన్నా పెద్ద హోదాలో నా కుమార్తె ఉద్యోగం సాధించడం కన్నా సంతోషం ఏముంటుంది?’’ అంటూ సంతోషంతో చెమ్మగిల్లిన కళ్లు తుడుచుకుంటున్నాడు కిస్తూరా రామ్. ఆయన పక్కనే చిరునవ్వు నవ్వుతూ ఉన్న ప్యారీ.. తన ప్రయాణంలో ఈ ఉద్యోగం ఆరంభం మాత్రమే అని, ఇంకా చాలా ముందుకెళ్లాలని ఉందని చెప్తోంది. జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షలో మెరిట్ ఆధారంగా ప్యారీ ఈ ఉద్యోగం సాధించింది. ఆమెను చూసి మరింత మంది బాడ్మేర్ అమ్మాయిలు ‘స్మశానం’ గేట్లు బద్దలు కొట్టుకొని వస్తారని ఆశిద్దాం.

Updated Date - 2021-08-03T01:06:00+05:30 IST