సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి
ABN , First Publish Date - 2020-07-14T06:39:38+05:30 IST
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ ఈ) 12వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో.. బాలుర కంటే 5.96శాతం ఎక్కువ మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు...
న్యూఢిల్లీ, జూలై 13: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ ఈ) 12వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో.. బాలుర కంటే 5.96శాతం ఎక్కువ మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం బాలికల్లో 92.15గా, బాలల్లో 86.19గా ఉందని బోర్డు అధికారులు తెలిపారు. ట్రాన్స్జెండర్ విద్యార్థుల్లో 66.67శాతం ఉత్తీర్ణత నమోదైంది.
మొత్తమ్మీద ఉత్తీర్ణత శాతం గత ఏడాదికంటే 5.38 మేర పెరిగిందని వివరించారు. గత ఏడాది 83.4శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవ్వగా.. ఈ సారి 88.78శాతం మంది పాసయ్యారు. ఈ ఏడాది మొత్తం 11.92 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కొవిడ్-19 నేపథ్యంలో మెరిట్ లిస్టును ప్రకటించబోమని అధికారులు తెలిపారు. ఈ సారి ‘ఫెయిల్’ అనే పదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో ‘ఎసెన్షియల్ రిపీట్’ అని పేర్కొంటామని వివరించారు. ఫెయిల్ అనే పదాన్ని వాడటం వల్ల విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని అభిప్రాయపడ్డారు. వెబ్సైట్లోనూ.. విద్యార్థుల మార్కుషీట్లలోనూ ఈ మార్పు ఉంటుందని తెలిపారు. నిజానికి ఇది ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. 1.57 లక్షల మంది విద్యార్థులు 90శాతానికి పైగా స్కోరు సాధించగా.. వారిలో 38వేల మందికి 95ు కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని సీబీఎ్సఈ తెలిపింది. త్రివేండ్రం రీజియన్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం(97.67) నమోదైందని, పట్నా రీజియన్ చివరి(74.57) స్థానంలో ఉందని వెల్లడించింది. అసె్సమెంట్ స్కీమ్ ఆధారంగా ఇచ్చిన మార్కులపై అసంతృప్తి ఉన్న విద్యార్థులకు ఐచ్ఛిక సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. ఈ పరీక్షల్లో వచ్చే మార్కులే ఫైనల్ అని వివరించింది.