ప్రారంభ ధర కిలో రూ.200 ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-03-06T06:47:10+05:30 IST
ఏడాది పొగాకు కొనుగోళ్లు ప్రారంభం రోజున కిలో రూ.200 ప్రారంభ ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు.
పొగాకు రైతు ప్రతినిధుల డిమాండ్
ఈ సీజన్ వేలంపై ముందస్తు భేటీ
ఒంగోలు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు ప్రారంభం రోజున కిలో రూ.200 ప్రారంభ ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆ మేరకు పొగాకు బోర్డు అధికారులు, వ్యాపారులను కోరుతూ శుక్రవారం ఇక్కడి ఆర్ఎం కార్యాలయంలో జరిగిన రైతు ప్రతినిధుల సమావేశంలో తీర్మానించారు. ఈనెల 15నుంచి వేలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పొగాకు బోర్డు వైస్చైర్మన్ జీ.కొండారెడ్డి అధ్యక్షతన రైతు ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేలం తొలిరోజున ప్రారంభ ధర కిలో రూ.200 ఇస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. అలాగే ప్రారంభం నుంచే వ్యాపారులందరూ పాల్గొని చివరివరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు బోర్డు, మార్క్ఫెడ్లు కూడా వేలంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. బోర్డు విజిలెన్స్ అధికారి దామోదర్, ఎస్ఎల్ఎస్ ఆర్ఎం దివి వేణుగోపాల్లు దక్షిణాదిలో అక్రమ కొనుగోళ్ల వ్యవహారంపై చర్చించారు. కొంతమంది వ్యాపారులు, అలాగే కొందరు రైతులు కూడా అక్రమ కొనుగోళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న వారు అలాంటి వారిపై బోర్డు యంత్రాంగం నిఘా పెట్టిందన్నారు.