4 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు పక్కా ప్లాన్..రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు!
ABN , First Publish Date - 2020-07-02T15:04:55+05:30 IST
ప్రభుత్వ యంత్రాంగం కరోనా కట్టడి చేసేందుకు తలమునకలై ఉండగా కబ్జాదారులు ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రాత్రే మహనీయుల
దేవేందర్నగర్లో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
దుండిగల్/ గాజులరామారం, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ యంత్రాంగం కరోనా కట్టడి చేసేందుకు తలమునకలై ఉండగా కబ్జాదారులు ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రాత్రే మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని దేవేందర్నగర్లో మంచినీటి రిజర్వాయర్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నెం.329/1లో సుమారు 4 ఎకరాలు కబ్జా చేసేందుకు రాత్రిరాత్రే డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉండే రెండు వర్గాల వారు ప్రణాళిక ప్రకారం మీకు సగం, మాకు సగం అనే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పలు బస్తీల ప్రజలు ఆరోపిస్తున్నారు. దేవేందర్నగర్ చుట్టు పక్కన కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ఇప్పటికే కబ్జాదారుల చేతుల్లో కనుమరుగైంది. గతంలో ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టి కబ్జాదారులపై కేసులను నమోదు చేసినప్పటికీ ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వ భూములు కాపాడుతాం
దేవేందర్నగర్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం.
- గౌరీవత్సల, కుత్బుల్లాపూర్ తహసీల్దార్