ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవ్వాలి
ABN , First Publish Date - 2022-07-28T05:35:07+05:30 IST
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవ్వాలని, అందులో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, భాగస్వాములు కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
- గట్టు మండలంలో విస్తృత పర్యటన
- అభివృద్ధి పనుల పరిశీలన
గట్టు, జూలై 27 : ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవ్వాలని, అందులో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, భాగస్వాములు కావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గట్టు మండలంలోని ఆరగిద్ద, తప్పెట్లమొర్సు, గొర్లఖాన్దొడ్డి, పెంచికలపాడు, రాయపురం, గట్టు గ్రామాలలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. గట్టు గురుకుల పాఠశాలలో వంట గదులను పరిశీలించారు. వంట గది పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేశించారు. విద్యార్థులతో మాట్లాడి బోజనం నాణ్యతను ఆరా తీశారు. మధ్యాహ్నభోజనం రికార్డులను, హాజరు పట్టి కలను పరిశీలించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాయపురంలో ‘మన ఊరు - మన బడి పనులను పరిశీలించారు. పెంచికలపాడు, తప్పెట్లమొర్సులలో అంగ న్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కోడిగుడ్లు ఇస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లే వారికి గుడ్లను బాక్స్లో పెట్టి ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తునందున మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సర్పంచ్లకు సూచించారు. ఆరగిద్దలో సబ్సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. గట్టులో మెగా పార్కును పరిశీలించారు. 15 ఎకరాల్లో ఉన్న ఈ పార్కులో 16 వేల మొక్కలు నాటాలని సర్పంచ్ ధనలక్ష్మికి సూచించారు. అనంతరం సర్పంచ్తో కలిసి పార్కులో మొక్కలు నాటారు. గట్టు ప్రభుత్వ అసుపత్రిని పరిశీలించారు. రోగులకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అదే విధంగా గట్టు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్యామ్సుందర్, ఎంపీడీవో చెన్నయ్య, తాహసీల్దార్ సహదేవ్, డిప్యూటీ ఈఈ రవీందర్, సర్పంచ్లు ధనలక్ష్మి, కృష్ణయ్య గౌడ్, శశికళ, శంకరమ్మ, ప్రవీణ్, కో-ఆప్షన్ సభ్యులు సత్యనారాయణ, కాంట్రాక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
‘అమృత్ సరోవర్’తో చెరువుల అభివృద్ధి
గద్వాల క్రైం : చెరువులను అభివృద్ధి చేసి సాగునీటి వసతిని పెంపొందించేందుకు అమృత్ సరోవర్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. అమృత్ సరోవర్ పథకం కింద జిల్లాలో 75 చెరువులు ఎంపికయ్యాయని తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు ఎన్ని చెరువుల్లో పనులను ప్రారంభించారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల కింద లబ్ధిదారులు, సర్పంచుల పేర్లను యాప్లో నమోదు చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి కనీసం 20 చెరువులను ఈ పథకం కింద అభివృద్ధి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్డీఏ నాగేంద్రం పాల్గొన్నారు.