రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు
ABN , First Publish Date - 2021-10-17T04:59:55+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ టీ.జీవన్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ టీ.జీవన్రెడ్డి
సుభాష్నగర్ (కరీంనగర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ టీ.జీవన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్లోని ప్రెస్క్లబ్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్తే అనేక మంది రైతులు వారి గోడును వెల్లబోసుకున్నారని అన్నారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ కూడా ఈ విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి అని ప్రజాప్రతినిధులే మాట్లాడడం సరికాదని, సీఎం కేసీఆర్కు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని అన్నారు. పప్పుదినుసులు, నూనె గింజల సేకరణ ఇంతవరకు జరుగలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2009 మధ్యకాలంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి రైతులకు 200 నుంచి 500 వరకు ప్రోత్సాహం అందించారని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రభుత్వం రైతుకు రూ. 1000 నుంచి రూ. 1500 ప్రోత్సాహం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. వరి, మొక్కజొన్న పంటల కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి సత్యం, వైద్యుల అంజన్కుమార్, గుండాటి శ్రీనివాస్రెడ్డి, బోనాల శ్రీనివాస్, మేకల నర్సయ్య, మొసిన్, తాజ్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.