కరోనాపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
ABN , First Publish Date - 2020-06-04T10:19:02+05:30 IST
కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఏపీ గవర్నర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
కర్నూలు, జూన్ 3(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఏపీ గవర్నర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. బుధవారం విజయవాడ రాజ్భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి ముఖేశ్ కుమార్, రెడ్క్రాస్ ఏపీ చైర్మన్ శ్రీధర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏకే పరీడాతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కరోనా, లాక్డౌన్ పరిస్థితుల్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ విస్తృత సేవలు అందించిందని గవర్నర్కు నివేదించారు. రెడ్క్రాస్ ఆధ్యర్యంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కరోనాపై అవగాహన కల్పించామన్నారు. జిల్లాలో 25 వేల కరపత్రాలు, 4 వేల మాస్కులను పంపిణీ చేశామని అన్నారు.
క్షేత్రస్థాయిలో కొవిడ్ విధులు నిర్వహించే అఽధికారులకు రెండు వేల శానిటైజర్లను అందించామన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో రెడ్క్రాస్ సేవలు అద్భుతమని ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చిన వలస కార్మికులకు ప్రతిరోజు నాలుగు వందల ఆహార పొట్లాలను రెండు నెలలపాటు అందజేశామని అన్నారు. 500 మంది దాతల నుంచి రక్తాన్ని సేకరించి 146 మంది తలసేమియా బాధితులకు అందించామని వివరించారు. అరవై వలంటీర్ల ద్వారా ఇంటింటికి ఐఈసీ మెటిరియల్ను అందించామన్నారు. యువ భారత్ సేవాసమితి, వర్ష రెసిడిన్స్ టీచర్స్ అసోసియేషన్, ఎన్సీసీ అఽధికారులు, కేడెట్లు సేవలు అందించారని నివేదించారు. జేసీ-2 రామసుందర్రెడ్డి ట్రైనీ కలెక్టర్ నిధి మీనా, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ స్పెషల్ అధికారి నాగరాజు నాయుడు, సభ్యులు డా. కుమారస్వామి, డా. రామచంద్ర పాల్గొన్నారు.