సొంతూళ్లలోనే జనం...నగరానికి రావాలంటే..కరోనా భయం
ABN , First Publish Date - 2022-01-18T14:30:06+05:30 IST
నగరం నెమ్మదిగా కనిపిస్తోంది. సంక్రాంతి నేపథ్యంలో గ్రేటర్ నుంచి సొంతూళ్లకు భారీగా తరలివెళ్లిన ప్రజలు ఇంకా తిరిగి రాకపోవడంతో రహదారుల్లో ట్రాఫిక్
సాదాసీదాగా వాహనాల రాకపోకలు
హైదరాబాద్ సిటీ: నగరం నెమ్మదిగా కనిపిస్తోంది. సంక్రాంతి నేపథ్యంలో గ్రేటర్ నుంచి సొంతూళ్లకు భారీగా తరలివెళ్లిన ప్రజలు ఇంకా తిరిగి రాకపోవడంతో రహదారుల్లో ట్రాఫిక్ సాదాసీదాగా కనిపిస్తోంది. సాధారణ రోజులతో పోల్చితే సోమవారం 45 శాతం మాత్రమే వాహనాల రాకపోకలు కనిపించాయి. నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతోపాటు ప్రభుత్వం విద్యాసంస్థలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగించింది. దీంతో స్వగ్రామాల నుంచి భార్య, పిల్లలను వెంట తీసుకుని వచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపించడంలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, దినసరి కూలీలు, చిరువ్యాపారులు మాత్రమే కుటుంబ సభ్యులను ఇంటివద్దనే వదిలేసి ఒక్కరుగా నగరానికి వస్తున్నారు.
కనుమ మరుసటి రోజు తిరుగు ప్రయాణానికి రైళ్లు, బస్సుల్లో ముందస్తుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ.. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడంతో చాలామంది రావడం లేదు. దీంతో వాహనాల రద్దీతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్సిటీ, అమీర్పేట్, మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతంతమాత్రంగానే ఉంది. ఐటీ సంస్థలకు కూడా వర్క్ఫ్రమ్ హోం ఇవ్వడంతో టోలీచౌకీ, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్సిటీ, కొండాపూర్, మాదాపూర్, తదితర ప్రాంతాల్లో రద్దీ బాగా తగ్గింది. అయితే రైళ్లలో రద్దీ మాత్రం కొనసాగుతోంది. నగరానికి వస్తున్నవారు ముంబై, పుణె, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారితో నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్లలో సందడి నెలకొంది.
అదనపు బస్ ట్రిప్పులు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి నగరానికి వస్తుండటంతో వారికోసం జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలనుంచి అదనపు బస్లు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆర్టీసీ ఎండీ ఆదేశాలతో నగరంలో రద్దీ ప్రాంతాల్లో సూపర్ వైజర్లను నియమించడంతోపాటు బస్టా్పలో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు.