అవయవాల తరలింపునకు గ్రీన్‌ ఛానెల్‌

ABN , First Publish Date - 2020-09-21T07:46:22+05:30 IST

హైదరాబాద్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా అవయవాల తరలింపునకు ఆదివారం మరోసారి గ్రీన్‌

అవయవాల తరలింపునకు గ్రీన్‌ ఛానెల్‌

19.6 కిలోమీటర్లు 13 నిమిషాల్లో చేరిన అంబులెన్స్‌


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా అవయవాల తరలింపునకు ఆదివారం మరోసారి గ్రీన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. కొండాపూర్‌ కిమ్స్‌ ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్‌ వరకు 19.6 కిలోమీటర్ల మేర గ్రీన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసి అవయవాల తరలింపునకు సహకరించారు. అవయవాలతో కొండాపూర్‌ కిమ్స్‌ నుంచి 12.50 గంటలకు అంబులెన్స్‌లో బయలుదేరిన వైద్యబృందం, బేగంపేట కిమ్స్‌కు 1.03 గంటలకు చేరుకుంది.


గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటుతో 19.6 కిలోమీటర్ల దూరం కేవలం 13 నిమిషాల్లో చేరుకునేందుకు వీలయింది. అవయవాలను సకాలంలో ఆస్పత్రికి చేరుకునేలా సహకరించిన ఇరు కమిషనరేట్ల ట్రాఫిక్‌ పోలీసులకు వైద్య సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. అపత్కాలంలో అవయవాలను తరలిస్తుండగా, ఇందుకు ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయంతో గ్రీన్‌ ఛానెల్‌ను ఏర్పాటు చేసి, సకాలంలో అవయవాలు చేరేలా చేస్తున్నారు. 


శనివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బేగంపేట కిమ్స్‌కు గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేయగా, ఆదివారం ఏర్పాటు చేసిన గ్రీన్‌ చానెల్‌తో ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 10 సార్లు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేశామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-09-21T07:46:22+05:30 IST