అడుగంటుతున్న భూగర్భ జలాలు
ABN , First Publish Date - 2021-09-19T05:00:37+05:30 IST
పారిశ్రామిక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కడ బోరు తవ్వినా రెండు మూడువందల అడుగుల లోతు వరకు నీరు పడడం లేదు.
పారిశ్రామిక ప్రాంతంలో నీటి ఎద్దడి
భారీ భవంతుల నిర్మాణం, హెచ్పీసీఎల్ విస్తరణే కారణమని స్థానికుల ఆరోపణ
మల్కాపురం, సెప్టెంబరు 18 : పారిశ్రామిక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కడ బోరు తవ్వినా రెండు మూడువందల అడుగుల లోతు వరకు నీరు పడడం లేదు. హెచ్పీసీఎల్ విస్తరణకు ముందు అయితే దాదాపుగా 50 నుంచి 100 అడుగుల లోతులోనే నీరు పడేది. ఇప్పుడా పరిస్థితి లేదు. హెచ్పీసీఎల్ విస్తరణతో పాటు ఈ ప్రాంతంలో కొత్తగా 16 అంతస్థుల భవనాలను కూడా జోరుగా నిర్మిస్తున్నారు. హెచ్పీసీఎల్ విస్తరణలో భాగంగా సంస్థలో వందలాది బోర్లు తవ్వారు. ఏడాది క్రితం భారీ రిగ్లతో చాలా బోర్లు తవ్వడంతో పరిసర ప్రాంతాల్లో బోర్లు తవ్వినా నీరు పడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వెంకన్నపాలెంలో పదిహేనేళ్లుగా అదే పరిస్థితి
గత పదిహేనేళ్ల క్రితం నుంచే స్థానిక వెంకన్నపాలెంలో బోర్లను తవ్వడం మానేశారు. ఈ ప్రాంతానికి హెచ్పీసీఎల్ సమీపంలో ఉండడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు కలుషితమై క్రమేపీ జలాలు ఎండిపోయాయి. అప్పట్లో ఇక్కడ పరిశీలించిన ఆంధ్రా యూనివర్సిటీ నిపుణులు ఈ ప్రాంతంలో బోర్లు తవ్వినా నీరు పడదని స్పష్టం చేశారని స్థానికులు చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి ఇక్కడ ఎవరూ బోర్లు తవ్వడం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చింది. జీవీఎంసీ అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.