జీఎస్‌టీ వసూళ్ళలో సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2021-04-01T20:48:52+05:30 IST

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ళలో

జీఎస్‌టీ వసూళ్ళలో సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ళలో సరికొత్త రికార్డు నమోదైంది. 2021 మార్చిలో రూ.1.23 లక్షల కోట్లు వసూలైంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే సమయంలో వసూలైనదాని కన్నా 27 శాతం ఎక్కువ. గడచిన ఐదు నెలల నుంచి జీఎస్‌టీ వసూళ్ళు పుంజుకుంటున్నాయి. ఈ వివరాలను  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. 


ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, వస్తువుల దిగుమతులపై ఆదాయం 2020 మార్చిలో కన్నా 70 శాతం అధికంగా 2021 మార్చిలో వచ్చింది. సేవల దిగుమతి సహా దేశీయ లావాదేవీల నుంచి ఆదాయం 2020 మార్చిలో కన్నా 17 శాతం ఎక్కువగా ఈ ఏడాది మార్చిలో వచ్చింది. 


2021 మార్చిలో వసూలైన గ్రాస్ జీఎస్‌టీ రెవిన్యూ రూ.1,23,902 కోట్లు అని ఈ ప్రకటన పేర్కొంది. దీనిలో సీజీఎస్‌టీ రూ.22,973 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.29,329 కోట్లు, ఐజీఎస్‌టీ (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.31,097 కోట్లు సహా) రూ.62,842 కోట్లు, సుంకాలు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.935 కోట్లు సహా) రూ.8,757 కోట్లు అని తెలిపింది. 


2019-20 ఆర్థిక సంవత్సరంలో 12 నెలలకు తొమ్మిది నెలల్లో జీఎస్‌టీ ఆదాయం రూ.1 లక్ష కోట్ల మార్క్‌ను తాకింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 వల్ల ఆదాయానికి గండి పడింది. ఆరు నెలల నుంచి జీఎస్‌టీ వసూళ్ళు ప్రతి నెలా రూ.1 లక్ష కోట్ల మార్కును తాకుతోందని, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నదనడానికి ఇదే నిదర్శనమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2021-04-01T20:48:52+05:30 IST