ఆ వార్తలు అబద్ధం: గుత్తా సుఖేందర్ రెడ్డి
ABN , First Publish Date - 2021-10-04T15:51:43+05:30 IST
టీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అబద్ధమని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
నల్గొండ: టీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అబద్ధమని శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. రైతులు చేస్తున్న న్యాయపరమైన పోరాటాన్ని అణిచివేయాలని కేంద్రం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీజేపీ చేస్తున్న దమనకాండకు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. బీజేపీకి ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై బురద జల్లే ప్రయత్నం ఇప్పటికైనా ఆపాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.