నేను ఉక్రెయిన్ నుంచి రాను!
ABN , First Publish Date - 2022-02-28T08:46:47+05:30 IST
ఎప్పుడు విమానం దొరుకుతుందా? ఎప్పుడు స్వదేశం చేరుతామా? అని ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులు ఆశగా ఎదురుచూస్తుంటే ఆ ఒక్క 17 బాలిక మాత్రం వారికి
17 ఏళ్ల హరియాణా విద్యార్థిని స్పష్టం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఎప్పుడు విమానం దొరుకుతుందా? ఎప్పుడు స్వదేశం చేరుతామా? అని ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులు ఆశగా ఎదురుచూస్తుంటే ఆ ఒక్క 17 బాలిక మాత్రం వారికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ‘నేను ఉక్రెయిన్లోనే ఉంటాను. యుద్ధం ముగిసే దాకా భారత్కు రానేరాను’ అని తెగేసి చెబుతోంది. హరియాణాకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఎంబీబీఎస్ చదువుతోంది. యుద్ధం మొదలవ్వడంతో తానుంటున్న హాస్టల్ పరిసరాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆ నగరంలోనే మరోచోట ఓ భూస్వామ్య కుటుంబం ఇంట్లో అద్దెకు దిగింది. ఆ ఇంట్లో భార్యాభర్తలు, వారికి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొనేందుకు సైన్యంలో చేరి తుపాకీ పట్టాడు. ఇంటి పెద్ద సైన్యంలో చేరడంతో ఆ ఇంట్లో తల్లి, ముగ్గురు పిల్లలు మిగిలారని.. వారిని తాను చూసుకోవాలని అందుకే యుద్ధం ముగిసేదాకా తాను అక్కడే ఉంటానంటోందా భారతీయ విద్యార్థిని! ఆమె ఈ ఆదర్శాన్ని బాలిక తల్లి స్నేహితురాలు ఫేస్బుక్లో రాశారు.