పశువైద్య సేవలిక దూరాభారం
ABN , First Publish Date - 2021-08-05T06:29:12+05:30 IST
పాడిరైతులకు సేవలు అందిస్తున్న 145 గ్రామీణ పశువైద్యశాలలు ఇక కనుమరుగు కానున్నాయి.
చిత్తూరు(సెంట్రల్), ఆగస్టు 4: గ్రామీణప్రాంతాల్లో పాడి రైతులకు పశువైద్య సేవలు దూరం కానున్నాయి. రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) పేరుతో గ్రామీణ పశువైద్య శాలలు మూసివేయడానికి జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 145 గ్రామీణ పశువైద్యశాలలను ఒకే విడతలో మూసి వేయడానికి జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గురువారం అమరావతిలో జరిగే రాష్ట్ర పశుసంవర్థఖ శాఖ సమీక్షా సమావేశానికి జిల్లా నుంచి జేడీ అధ్యక్షతన చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, పుత్తూరు డివిజన్ల డీడీలు హాజరు కానున్నారు. నాలుగు డివిజన్ల పరిధిలో ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు 32 ఉండగా, వెటర్నరీ డిస్పెన్సరీలు 146, గ్రామీణ పశువైద్య శాలలు 145 ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని 145 గ్రామీణ పశువైద్య శాలలను ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు (ఏవీహెచ్), వెటర్నరీ డిస్పెన్షరీ(వీడీ)ల్లో విలీనం చేయనున్నారు. వీటితో పాటు ఇక్కడ పనిచేస్తున్న 551 మంది సిబ్బందిని తాలూకా, మండల, డివిజన్ కేంద్రాల్లోని ఏవీహెచ్, వీడీల్లో విలీనం చేయనున్నారు. వీరిలో వీఎల్వోలు (వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్) 32 మంది, జేవీవోలు (జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ) 64 మంది, ఎల్ఎస్ఏలు (లైవ్ స్టాక్ అసిస్టెంట్) 111 మంది,వీఏ లు(వెటర్నరీ అసిస్టెంట్) 120 మంది,ఓఎస్లు (ఆఫీసు సబార్డినేట్)224 మంది ఉన్నారు.గ్రామీణ పశువైద్య సేవలను ఆర్బీకేల్లోని పశువైద్య సహాయకుల చేత నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. జిల్లాలోని 947 రైతు భరోసా (ఆర్బీకే)ల్లో కేవలం 510 మంది పశు వైద్య సహాయకులను మాత్రమే ప్రభుత్వం నియమించింది. మిగిలిన 437 ఆర్బీకేల్లో పోస్టులు భర్తీ చేయకపోవడంతో గ్రామీణ పశువెద్య శాలల్లోని సిబ్బందే అదనపు బాధ్యతలు తీసుకుని సేవలందిస్తున్నారు.హేతుబద్దీకరణకు తాము వ్యతిరేకం కాదని గ్రామీణ పశువైద్య సిబ్బంది చెబుతున్నారు.అయితే వీటిని తాలూకా, మండల కేంద్రాల్లోని పశువైద్య ఆసుపత్రుల్లో విలీనం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు అందించలేని పరిస్థితులు నెలకొంటాయంటున్నారు.ఈ విషయమై గ్రామీణ పశువైద్య సిబ్బంది సంఘం నాయకులు వెటర్నరీ శాఖ జేడీకి, కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.