విస్సన్నపేటలో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-05-14T05:38:23+05:30 IST
విస్సన్నపేటలో భారీ వర్షం
నేలకొరిగిన చెట్లు
మామిడికి తీవ్ర నష్టం
విస్సన్నపేట, మే 13: మండలంలో గురువారం ఈదురుగాలలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన మామిడి గాలి వానకు నేలరాలింది. భారీ చెట్లు ఈదురు గాలులకు నేలకొరిగాయి. అసలే మామిడికి ధర లేక దిగాలుగా ఉన్న రైతుపై అకాల వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
చాట్రాయి మండలంలో 70 శాతం పంట కల్లాలలోనే..
చాట్రాయి: మండలంలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, ధాన్యం, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు మందగొడిగా సాగుతుండటంతో 70 శాతం పంట కల్లాలపైనే ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి బలమైన ఈదురుగాలులు తోడవడంతో చెట్లకు ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. కరోనా ప్రభావంతో ఎగుమతులు లేక మామిడి కాయలు కోతలు సరిగా జరగడంలేదు. ఇంకా అకాల వర్షాలు కొనసాగితే పంట సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు కలవర పడుతున్నారు.