జోరువాన

ABN , First Publish Date - 2021-06-24T04:34:41+05:30 IST

గోపాలపట్నంలో బుధవారం ఉదయం కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జోరువాన
కొత్తపాలెం అండర్‌పాత్‌వేలో ప్రవహిస్తున్న వర్షపు నీరు

లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం


గోపాలపట్నం, జూన్‌ 23 : గోపాలపట్నంలో బుధవారం ఉదయం కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు గంటన్నర సేపు కురిసిన వర్షానికి గోపాలపట్నం కొండవాలు ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీటితో గెడ్డలు పొంగి ప్రవహించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీరు కొత్తపాలెం, వెంకటాపురం గ్రామ శివారుల్లోని పంట పొలాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయింది. కుండపోతగా కురిసిన వర్షంతో బీఆర్‌టీఎస్‌ ప్రధాన రహదారిలో పలుచోట్ల నీరు నిలిచిపోయింది. రహదారి నుంచి వర్షపు నీరు సక్రమంగా ప్రవహించే మార్గం లేకపోవడంతో చెరువును తలపించింది. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో రహదారులు నిర్మాణం జరగని ప్రాంతాల్లో చిత్తడిగా మారాయి. పలు చోట్ల పైప్‌లైన్‌ ఏర్పాటుకు రహదారుల్లో తవ్వకాలు చేపట్టి వాటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో వర్షం దెబ్బకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. 

కొండవాలు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన

వర్షం కురిస్తే కొండవాలు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది. వర్షం కురిస్తే రక్షణ గోడల నిర్మాణం జరగని చోట కొండచరియలు జారిపడే ప్రమాదం ఉన్నందున ఆ ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారు. స్థానిక రామకృష్టానగర్‌ కొండవాలు ప్రాంతంలో పలు చోట్ల రక్షణ గోడలు శిథిలావస్థకు చేరడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గోపాలపట్నం కొండవాలు ప్రాంతాలైన ఇందిరానగర్‌, లక్ష్మీనగర్‌, రామకృష్ణానగర్‌ ప్రాంతంలో పలు చోట్ల రక్షణ గోడలు శిథిలావస్థకు చేరాయి. అధికారులు స్పందించి ఆయా ప్రాంతాల్లో రక్షణ గోడలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

పారిశ్రామిక ప్రాంతంలో..

మల్కాపురం: పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మల్కాపురం ప్రధాన రహదారిలో వర్షపు నీరు నిలిచిపోయింది. పోర్టు క్వార్టర్స్‌ రహదారి, ఐఓసీ రహదారి వర్షం కారణంగా బురదమయంగా మారింది. మల్కాపురం ప్రధాన రహదారి నిర్మాణ సమయంలో రోడ్డుకు ఆనుకుని డ్రైనేజీ నిర్మించకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచిపోతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-06-24T04:34:41+05:30 IST