red alert: ఆగస్టు 1వరకు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు
ABN , First Publish Date - 2021-07-30T12:57:40+05:30 IST
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆగస్టు 1వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది....
న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆగస్టు 1వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. తూర్పు, పడమర, మధ్యభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన తాజా బులిటిన్ లో పేర్కొంది. శుక్రవారం రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని, ఐఎండీ ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది.జమ్మూకశ్మీరులోని కిష్టవర్ జిల్లా హోంజార్ గ్రామంలో భారీవర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించడంతో ఏడుగురు మరణించారు. శుక్రవారం జమ్మూకశ్మీరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
నాగౌర్, సికార్, అజ్మీర్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని, ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జైపూర్, జుంజును, టోంక్,కోట,భిల్వారా, బరన్, చురు, ఝలావర్ జిల్లాల్లో ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 15 జి్లలాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురవవచ్చునని అధికారులు చెప్పారు.ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురవవచ్చని ఐఎండీ తన బులెటిన్ లో వివరించింది.