ముంచెత్తిన వాన
ABN , First Publish Date - 2020-07-14T10:03:00+05:30 IST
జిల్లాలో సోమ వారం భారీ వానలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి.
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, జూలై13: జిల్లాలో సోమ వారం భారీ వానలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఆయా గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఉదయం 8 గంటల వరకు 40 మండలాల్లో 8.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దుగ్గిరాల మండలంలో అధి కంగా 60.2 మి.మీ, తక్కువగా కారంపూడిలో 1.2 మి.మీ చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 56.3 మి.మీ వర్షపాతం నమోదు కావలసి ఉండగా 110 మి.మీ కురిసి 95శాతం ఎక్కువగా ఉనట్లు అధికారులు చెప్పారు. ఎగువున ఉన్న వాగులు వద్ద సోమవారం వరద ఉధృతి తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వరద నీటిని స్వల్పంగా విడుదల చేస్తున్నారు. ఎగువున ఉన్న కీసర నుంచి 9300 క్యూసెక్కులు వరద నీరు ఇన్ఫ్లోగా వస్తుందని నీటి పారుదల శాఖ జె.ఈ.దినేష్ తెలిపారు. బ్యారేజ్ వద్ద ఒక గేటును అడుగు మేర ఎత్తి దిగువకు 720 క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు.
తూర్పు, పశ్చిమ కాల్వలకు 6,300 క్యూసెక్కులు నీటిని విడుదల చేసున్నారు. సత్రశాలలోని నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మొదటి యూనిట్ ద్వారా 0.1635 ఎంయుల విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ వెంకట్రామిరెడ్డి చెప్పారు. విద్యుత్ తయారీ అనంతరం టేల్రేస్ ఛానల్ ద్వారా 1,165 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశామన్నారు.