ఇంకో గండం
ABN , First Publish Date - 2020-08-14T11:42:12+05:30 IST
జిల్లాకు భారీ వర్షం ముప్పు, అటు గోదావరికి వరద పోటు ముప్పు పొంచి ఉంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
జిల్లాకు భారీ వర్షాలు, గోదావరి వరద ముప్పు
రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తం
కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్రూమ్ల ఏర్పాటు
అన్ని తీరప్రాంత మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లోనూ..
నేటి రాత్రికి గోదావరిలో ఏడు లక్షల క్యూసెక్కులకు పెరగనున్న వరద
కోనసీమలో లంకలకు వరద ముప్పు.. సిద్ధమైన సహాయక బోట్లు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లాకు భారీ వర్షం ముప్పు, అటు గోదావరికి వరద పోటు ముప్పు పొంచి ఉంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణ సహాయక చర్యలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీసు శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా రానున్న రెండు రోజుల్లో జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చ రికలు జారీచేసింది. దీంతో కలెక్టర్ రెవెన్యూ, పోలీసు శాఖలతో గురువారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో తుఫాను ముప్పు నేపథ్యంలో సహాయక చర్యల కోసం కలెక్టరేట్, అన్ని ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని తీర ప్రాంత మండలాల్లోను గురువారం రాత్రి నుంచి కంట్రోల్రూంలు ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం అవసరమైన సామగ్రి అంతా సిద్ధం చేశారు.
అటు వర్షం ముప్పుతోపాటు గోదావరికి వరద ముప్పు కూడా పొంచి ఉండడంతో మరింత అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం గోదావరిలో ధవళేశ్వరం వద్ద 5 లక్షలు క్యూసెక్కుల వదర ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రిలోగా ఇది ఏడు లక్షల వరకు పెరగనున్నట్టు నీటిపారుదలశాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. భద్రాచలం నుంచి ఈ వరద మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందని అంచనా వేశారు. వాస్తవానికి 10 లక్షల క్యూసెక్కుల వరద వస్తే గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక ఎగుర వేస్తారు. ఏడు లక్షలు వస్తే కోనసీమలోని కొన్ని లంక గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుంటాయి. దీంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. పి.గన్నవరం మండలంలో లంక గ్రామాలకు రాకపోకలు తెగి పోయే ప్రమాదం ఉండడంతో సహాయక చర్యల కోసం బోట్లను సిద్ధం చేశారు.