పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత
ABN , First Publish Date - 2021-12-07T04:15:35+05:30 IST
పోలింగ్ కేంద్రాలు, పరిసరాల్లో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు వీరబ్రహ్మయ్య ఆదేశించారు. సోమవారం ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్తో కలిసి మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూం, పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
–===========================
ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు వీరబ్రహ్మయ్య
మెదక్ అర్బన్, డిసెంబరు 6 : పోలింగ్ కేంద్రాలు, పరిసరాల్లో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు వీరబ్రహ్మయ్య ఆదేశించారు. సోమవారం ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్తో కలిసి మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూం, పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కళాశాలలో ఉన్న నాలుగు సీసీ కెమెరాలకు అదనంగా మరో రెండు కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రంలోకి వచ్చి, వెళ్లడానికి ఒకే ప్రధాన ద్వారాన్ని ఉపయోగించేలా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వారి వెంట ఎన్నికల సహాయ అధికారి రమేష్, తహసీల్దార్ భానుప్రకాశ్ తదితరులు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలకు 9, 10న సెలవు
మెదక్ రూరల్, డిసెంబరు 6: పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంస్థలకు పోలింగ్ జరిగే 10వ తేదీన, ముందస్తుగా ఏర్పాట్ల కోసం 9వ తేదీన సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 14న మెదక్ ప్రభుత్వ బాలుర కళాశాలకు సెలవు ఇస్తున్నట్లు వెల్లడించారు.