అప్పు కట్టలేక ఆ భర్త ఏం చేశాడంటే.. ఏకంగా భార్యనే..

ABN , First Publish Date - 2021-07-13T08:49:56+05:30 IST

అలనాడు ధర్మరాజు జూదంలో ద్రౌపదిని ఓడి.. కౌరవులు ఆమెను వివస్త్రను చేస్తున్న చూస్తూ కూర్చుండిపోయాడు. అయితే అది ద్వాపరయుగం. కానీ ప్రస్తుత కలియుగంలో..

అప్పు కట్టలేక ఆ భర్త ఏం చేశాడంటే.. ఏకంగా భార్యనే..

భోపాల్: అలనాడు ధర్మరాజు జూదంలో ద్రౌపదిని ఓడి.. కౌరవులు ఆమెను వివస్త్రను చేస్తున్న చూస్తూ కూర్చుండిపోయాడు. అయితే అది ద్వాపరయుగం. కానీ ప్రస్తుత కలియుగంలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ భర్త తలకుమించిన అప్పులు చేసి.. అవి కట్టలేక ఏకంగా తన భార్యను అమ్మేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గున ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అవసరాలు తీర్చుకునేందుకు ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు.


గడువు ముగియడంతో అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బు కట్టాలంటూ అతడిపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ అప్పు తీర్చేందుకు అతడి వద్ద డబ్బులు లేవు. దీంతో తాను ఆ అప్పులు తీర్చలేనని తెలుసుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచించాడు. వెంటనే తన భార్య గుర్తుకు వచ్చింది. అక్షరాలా లక్ష రుపాయలకు తన భార్యను అమ్ముతున్నట్లు వాళ్లకే బేరం కుదుర్చుకున్నాడు.


పొలంలో పనిచేసుకుంటున్న తన భార్య వద్దకు వాళ్లని తీసుకెళ్లి మరీ..  ‘నిన్ను అమ్మేశా. వాళ్లతో వెళ్లిపో..’ అన్నాడు. ఒక్కసారిగా భర్త నోటి నుంచి ఊహించని మాట వినేసరికి ఆమె నోట మాట రాలేదు. కట్టుకున్న భర్తే తనను అంగట్లో వస్తువులా అమ్మేశాడని తెలిసి ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది. తనను విక్రయించడాన్ని వ్యతిరేకించింది. ప్రతిఘటించింది. దీంతో ఆ భర్తకు తన పురుషాహంకారం దెబ్బతిని.. ఏకంగా ఆమెను చంపడానికే యత్నించాడు. వివాదం రేగిన తరువాత రాత్రి ఇంట్లో నిద్రపోతున్న భార్యను తీసుకెళ్లి బావిలో పడేశారు. ప్రాణాలతో బయటపడ్డ మహిళ తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తపై ఫిర్యాదు చేయడంతో కథంగా వెలుగులోకొచ్చింది.

Updated Date - 2021-07-13T08:49:56+05:30 IST