ఈ నెల 4న నిశ్చితార్థం.. పెళ్లి డేట్ ఫిక్స్ చేయాలని చూస్తుండగా..

ABN , First Publish Date - 2021-07-11T14:06:00+05:30 IST

ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో కార్తీక్‌కు వివాహ నిశ్చితార్థం జరిగింది. వివాహ తేదీని వచ్చేనెల ..

ఈ నెల 4న నిశ్చితార్థం.. పెళ్లి డేట్ ఫిక్స్ చేయాలని చూస్తుండగా..

చెన్నై/హైదరాబాద్ సిటీ : వేలూరు జిల్లాలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువకుడు కార్తీక్‌ (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన లక్ష్మా నాయక్‌ కుమారుడు కార్తీక్‌ (27) ఎంటెక్‌ చదివి, మిన్నల్‌ గ్రామంలో ఇండియన్‌ బ్యాంకులో 8 నెలలుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో కార్తీక్‌కు వివాహ నిశ్చితార్థం జరిగింది. వివాహ తేదీని వచ్చేనెల ఖరారు చేయాలని ఇరువైపు తల్లిదండ్రులు నిర్ణయించారు. నిశ్చితార్థం ముగిసిన తర్వాత కార్తీక్‌ ఇటీవల అరక్కోణంకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అతను దిగులుగా ఉన్నట్లు తోటి సిబ్బంది చెబుతున్నారు. 


ఈ నేపథ్యంలో కార్తీక్‌ బసచేస్తున్న ఇంటిలోని ఓ గది నుంచి శనివారం దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గది తలుపులను పగులగొట్టి చూడగా నేలపై కార్తీక్‌ మృతదేహం కనిపించింది. గదిలో ఉరితాడు వేలాడుతుండటంతో ప్రాణం పోయిన తర్వాత కార్తీక్‌ నేలపై పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కార్తీక్‌ ఓ యువతిని ప్రేమించాడని, తల్లిదండ్రులు ప్రేమవివాహాన్ని అంగీకరించకుండా మరో యువతితో నిశ్చితార్థం చేయడంతో అతను ఆత్మహత్యకు ఒడిగట్టాడని పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తెలిసింది.

Updated Date - 2021-07-11T14:06:00+05:30 IST