పంజాబ్ పీసీసీ చీఫ్‌ మరొకరికి ఇచ్చినా సిద్ధమే: సునీల్ జక్కర్

ABN , First Publish Date - 2021-06-12T00:05:04+05:30 IST

పంజాబ్ పీసీసీ చీఫ్‌ మార్పు జరగొచ్చంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పదవిలో ఉన్న సునీల్..

పంజాబ్ పీసీసీ చీఫ్‌ మరొకరికి ఇచ్చినా సిద్ధమే: సునీల్ జక్కర్

మొహాలి: పంజాబ్ పీసీసీ చీఫ్‌ మార్పు జరగొచ్చంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పదవిలో ఉన్న సునీల్ జక్కర్ శుక్రవారంనాడు సూటిగా స్పందించారు. పంజాబ్‌లో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తగిన వారెవరైనా ఉంటే తనను తొలగించవచ్చని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి శక్తిసామర్థ్యాలతో కాంగ్రెస్ ఎదుర్కొంటుందని ఆయన చెప్పారు.


''పార్టీని పటిష్టం చేసేందుకు ఎవరినైనా నియమించదలచుకుంటే ఆ పని చేయవచ్చు. నన్ను ఆ పదవి నుంచి తొలగించవచ్చు. మొదట్నించీ నేను ఆ మాట చెబుతూనే ఉన్నాను'' అని సునీల్ జక్కర్ చెప్పారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వెళ్తుందా అని అడిగినప్పుడు, పార్టీలో ఒకే కెప్టెన్ ఉన్నారనే విషయం చాలా స్పష్టమని, తమకు ఆయనే బలమైన, చాలా పెద్ద నేత అని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లాలా, వద్దా అనే అంశంపై తమ అభిప్రాయాన్ని పార్టీ ముందుంచాతామని చెప్పారు. తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం పార్టీ అధిష్ఠానం, సోనియాగాంధీనేనని అన్నారు.


కాగా, అమరీందర్ సింగ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని, నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కీలక పదవి అప్పగించాలని ముగ్గురు సభ్యుల కాంగ్రెస్ కమిటీ పార్టీ అధిష్ఠానానికి నివేదక అందించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-06-12T00:05:04+05:30 IST