విపక్ష పార్టీలతో పవార్ సమావేశంపై సంజయ్ రౌత్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2021-06-22T16:35:56+05:30 IST

శంలోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు వివిధ పార్టీల నేతలు, ప్రముఖులతో ఎన్‌సీపీ చీఫ్

విపక్ష పార్టీలతో పవార్ సమావేశంపై సంజయ్ రౌత్ ఏమన్నారంటే..

న్యూఢిల్లీ:దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు వివిధ పార్టీల నేతలు, ప్రముఖులతో ఎన్‌సీపీ చీఫ్   శరద్ పవార్ మంగళవారం సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ఉత్సుకత నింపింది. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పవార్ నేటి నుంచి ప్రయత్నాలు సాగిస్తారని ఎన్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. పవార్ ఏర్పాటు చేసిన సమావేశంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ తాజాగా స్పందించారు. పవార్ ఒక పెద్ద నేత అని, దేశ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితితో సహా పలు అంశాలపై అనేక మంది ఆయనను సంప్రదిస్తుంటారని రౌత్ వ్యాఖ్యానించారు. అయితే, ఇది పూర్తిగా అన్ని విపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశమని తాను అనుకోవడం లేదని అన్నారు. ఎస్‌పీ, బీఎస్‌పీ, వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు సమావేశంలో లేవని అన్నారు. కాగా, పవార్ తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, ఆప్ నుంచి సంజయ్ సింగ్, సీపీఐ నుంచి డి.రాజా తదితరులు హాజరుకానున్నట్టు ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ తెలిపారు.

Updated Date - 2021-06-22T16:35:56+05:30 IST