TS News: సంగారెడ్డిలో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-07T16:40:49+05:30 IST

జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో గల ఓ లాడ్జ్ నుంచి కిందకు దూకి మేఘ కపూర్ (22) అనే ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

TS News: సంగారెడ్డిలో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య

సంగారెడ్డి: జిల్లాలో ఐఐటీ హైదరాబాద్‌ (IIT Hyderabad) విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది.  పోతిరెడ్డిపల్లిలో మేఘ కపూర్ (22) అనే ఇంజినీర్ ఓ లాడ్జ్ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత నెలలో ఐఐటీ హైదరాబాద్‌లో కపూర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. నెల రోజులుగా లాడ్జ్‌లోనే ఉన్న కపూర్... ఈరోజు లాడ్జిపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. 


మరోవైపు ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వారం క్రితం ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్ విద్యార్థి రాహుల్ తాను ఉంటున్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన ల్యాప్‌టాప్‌లో ముఖ్యమైన విషయం ఉందంటూ రాహుల్ సూసైడ్ నోట్‌లో రాశాడు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే మరో విద్యార్థి ఆత్మహత్యతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-09-07T16:40:49+05:30 IST