దేవీపట్నం గ్రామం.. 30 రోజులుగా వరద నీళ్లలోనే...
ABN , First Publish Date - 2021-07-28T06:41:46+05:30 IST
ఒకటీ రెండూ కాదు.. ఏకంగా నెలరోజుల నుంచి ఆ గ్రామాలను వరద వదల్లేదు. గోదావరి ఎగువన ఉన్న ఈ పరీవాహక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
దేవీపట్నం, జూలై 27: ఒకటీ రెండూ కాదు.. ఏకంగా నెలరోజుల నుంచి ఆ గ్రామాలను వరద వదల్లేదు. గోదావరి ఎగువన ఉన్న ఈ పరీవాహక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కాఫర్డ్యామ్ వల్ల వరద నీరు వెనక్కు మళ్లుతోంది. ఈ బ్యాక్వాటర్ వల్ల దేవీపట్నం మండలంలో సుమారు 31 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వాటిలో సుమారు 42 గ్రామాల్లో వరదనీరు చేరడమేకాకుండా గ్రామాలను కూడా ముంచేసింది. దీంతో పలు గ్రామాల ప్రజలు ముందుగానే తమకు ఇచ్చిన పునరావాస కాలనీలకు తరలివెళ్లగా, కొన్ని గ్రామాల నిర్వాసితులు అద్దె ఇళ్లకు తరలివెళ్లారు. ఇక కొండమొదలులో రెండ్రోజుల కిందట ఒక గిరిజనుడు వరదలో మునిగి మరణించినట్టు సమాచారం.