పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఆందోళన..
ABN , First Publish Date - 2020-04-09T11:19:43+05:30 IST
నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి జనాన్ని వెంటాడుతూ వణికిస్తోంది. ఇప్పటికే నలుగురికి కరోనా పాజిటివ్ రిపోర్టు రాగా తాజాగా బుధవారం మరో ఆరుగురికి కరోనా పాజిటివ్
నిర్మల్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి జనాన్ని వెంటాడుతూ వణికిస్తోంది. ఇప్పటికే నలుగురికి కరోనా పాజిటివ్ రిపోర్టు రాగా తాజాగా బుధవారం మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అంతటా ఆందోళన మొదలైంది. స్థానిక జోహార్నగర్కు చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ లక్షణాల్చతో ఇప్పటికే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కొత్తగా కరోనా పాజిటివ్ లక్షణాలు బయట పడిన ఆరుగురిలో ముగ్గురు గల్ప్ నుంచి ఇటీ వలే వచ్చి క్వారంటైన్ అబ్జర్వేషన్లో ఉన్న వారు కాగా మరో వ్యక్తి బీహా ర్ నుంచి వలస కూలీగా వచ్చిన వారు కావడం గమనార్హం. మిగతా ఇద్దరు ఇటీవలే ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించిన వ్యక్తి తల్లి, కూతురుగా అధికారులు వెల్లడించారు.
కాగా మామడ మండలం న్యూ లింగంపల్లి, పెంబి మండలం రాయధారి, లక్ష్మణచాంద మండలం కనౄకాపూర్, రాచాపూర్ గ్రామాలకు చెందిన వీరిని అలాగే నిర్మల్కు చెందిన మరో ఇద్దరిని హుటాహుటిన బుధవారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు మొత్తం 141 మంది రక్తషాంపిళ్లను హైదరాబాద్కు పంపించగా ఇందులో నుంచి 40 మందికి నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. మరో పది మందికి పాజిటివ్ ఫలితాలు రావడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా మరో 74 మందికి సంబంధించిన రక్త పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. వీరికి ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. ప్రస్తుతం పాల్టెక్నిక్ కళాశాల, సోఫీనగర్లోని కేజీబీవీ కళాశాలతో పాటు గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజీల్లో క్వారంటైన్ అబ్జర్వేషన్ కేంద్రాలను కొనసాగిస్తున్నారు. దీనికి తోడుగా కొత్తగా చించోలి (బి) వద్ద మహిళ ప్రాంగణంలో మరో క్వారంటైన్ కేంద్రాన్ని ప్రారంభించారు.
అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో నుంచి మామడ మండలం న్యూ లింగంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురును క్వారంటైన్ను తరలించారు. అలాగే పెంబి మండలం రాయధారి, లక్ష్మణచాంద మండలం కనకాపూర్, రాచాపూర్ గ్రామాలకు చెందిన పాజిటివ్ వ్యక్తుల కుటుంబ సభ్యులు కాంటాక్ట్ అయిన వారందరినీ బుఽధవారం క్వారంటైన్కు తరలించి అబ్జర్వేషన్లో ఉంచారు. అలాగే నిర్మల్కు చెందిన మరో ఇద్దరి
కుటుంబ సభ్యులను అలాగే కాంటాక్ట్ అయిన వారందరిని క్వారంటైన్కు తరలించి అబ్జర్వేషన్లో పెట్టారు. అయితే మరో 74 మందికి సంబంధించిన రక్త పరీక్షల నివేదికల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంతో పాటు పాజిటివ్ కేసులు వచ్చిన వ్యక్తుల మండలాలు, భైంసా పట్టణం, నర్సా పూర్ (జి) మండలంలోని చాక్పల్లి గ్రామాల్లో అధికారులు ప్రత్యేక లాక్డౌన్ను కొనసాగిస్తూ ఈ ప్రాంతాలన్నింటినీ కరోనా ఎఫెక్టెడ్ జోన్లుగా ప్రకటించి చర్యలు తీసుకుంటున్నారు.
పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఆందోళన..
ఇదిలా ఉండగా జిల్లాలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. పాజిటివ్ కేసు లు పెరుగుతున్న అంశం స్థానిక జనాన్ని సైతం భయాందోళనకు లోను చేస్తోంది. ఇప్పటికే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒకరు కరోనాపాజిటివ్ లక్షణాలతో మరణించగా మరొకరు ఐసోలేషన్ సెంటర్లో అబ్జర్వేషన్లో ఉండి గుండెపోటుతో మరణించారు. అయితే గుండెపోటుతో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులిద్దరికీ బుధవారం కరోనా సోకినట్లు నిర్ధారణ కావడం ప్రాఽధాన్యతను సంతరించుకుంటోంది. సదరు వ్యక్తి కరోనా నెగెటివ్ రిపోర్టు రాగా ఆయన కుటుంబ సభ్యులిద్దరికీ కరోనా పాజిటివ్ రిపోర్టు రావడం అధికారులను హైరానాకు గురి చేస్తోంది. కాగా సదరు మృతుడు ఢిల్లీ జమాతేకు వెళ్లి వచ్చాడు.
ఈయనతో పాటు ఢిల్లీ జమాత్కు వెళ్ళిన భైంసాకు చెందిన ఒక వ్యక్తి, నర్సాపూర్ మండలం చాక్పల్లికి చెందిన మరోవ్యక్తి, గాజులపేట్కు చెందిన ఓ వ్యక్తికి ఇప్పటికే కరోనా పాజిటివ్ లక్షణాలు బయట పడ్డాయి. అయితే తాజాగా గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన ముగ్గురికి, బీహార్ నుంచి వలస కూలీగా వచ్చిన మరో వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు బయట పడడం అంతటా ఆందోళన రేకేత్తిస్తోంది. ఇప్పటి వరకు కేవలం ఢిల్లీ జమాతేకు వెళ్లి వచ్చిన వారికే కరోనా పాజిటివ్ లక్షణాలు బయట పడుతుండగా తాజాగా గల్ఫ్ వెళ్లి వచ్చిన వారికి కూడా కరోనా లక్షణాలు బయట పడుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇప్పటి వరకు గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారందరి క్వారంటైన్ పూర్తి కాబోతున్న క్రమంలోనే బుధవారం వెలువడిన పాజిటివ్ ఫలితాలు మరింత కఠిన చర్యలకు ఊతమిస్తున్నాయి.
లెక్కల గందరగోళం..
ఇదిలా ఉండగా క్వారంటైన్లలో అబ్జర్వేషన్ ఉంచుతున్న వారి సంఖ్యతో పాటు హైదరాబాద్కు రక్తపరీక్షల కోసం పంపిన వారి సంఖ్య , తీసుకుంటున్న చర్యల విషయంలో అధికారుల మధ్య సమన్వయం లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్కో అధికారి ఒక్కో రకంగా సంఖ్యలు చెబుతుండడం గందరగోళానికి తావిస్తోంది.
మహిళ ప్రాంగణంలో మరో క్వారంటైన్ ఏర్పాటు..
కాగా కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో బాధి తుల కుటుంబ సభ్యులను, అలాగే వారు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యా రో వారందరిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అయితే ప్రస్తు తం ఉన్న ప్రభుత్వ పాల్టెక్నిక్ కళాశాల, సోఫీనగర్లోని కేజీబీవీ పాఠశాల, ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలోని క్వారంటైన్ సెంటర్లు కిక్కిరిసి ఉన్నాయి. దీంతో పాజిటివ్ కేసులు పెరిగే సంఖ్య ఎక్కువ గా ఉండే అవకాశాలు ఉండడంతో అధికారులు కొత్తగా చించోలి (బి) వద్ద గల మహిళ ప్రాంగణాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. మరో 74 మందికి సంబందించిన రక్తపరీక్షల ఫలితాలు రావాల్సి ఉన్నం దున మరో క్వారంటైన్ సెంటర్ అవసరం ఏర్పడుతోంది.
కొనసాగుతున్న లాక్డౌన్..
ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ కేసులు ఓ వైపు క్రమంగా పెరిగిపోతుండడంతో అధికారులు మరోవైపు పకడ్బందీగా లాక్డౌన్ను కొనసాగిస్తున్నారు. భైంసా, నిర్మల్ పట్టణాల్లో అధికార యంత్రాంగం ప్రత్యేక లాక్డౌన్ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్ ముషారప్ ఆలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఎస్పీ శశిధర్ రాజులతో పాటు తదితరుల ఆధ్వర్యంలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 7గంటల నుంచి 10గంటల వరకు సడలింపును ఇచ్చి జనసంచారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసిబ్బంది సర్వే చివరి దశకు చేరుకుంది.