దేశం ముందు 'నార్కో టెర్రర్' ప్రమాదం: అమిత్షా
ABN , First Publish Date - 2021-07-13T00:10:58+05:30 IST
భారతదేశం ముందు 'నార్కో టెర్రర్' అనే మరో ప్రమాదం పొంచి ఉందని, దేశానికి పెను సవాళ్లను..
గాంధీనగర్: భారతదేశం ముందు 'నార్కో టెర్రర్' అనే మరో ప్రమాదం పొంచి ఉందని, దేశానికి పెను సవాళ్లను విసరనుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్ ఉన్న నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీలో ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఆఫ్ నార్కో డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ సెంటర్ను కేంద్ర మంత్రి సోమవారంనాడు ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి ఈ కేంద్రాన్ని అనుసంధానించాలనే నిర్ణయం తీసుకున్నట్టు అమిత్షా ఈ సందర్భంగా చెప్పారు. ఈ యూనివర్శిటీ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించడంతో పాటు ఫోరెన్సిక్ సైన్సెస్కు సేవలందించే అవకాశాన్ని యువత అందిపుచ్చుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. సైబర్ డిఫెన్స్, బారియాట్రిక్ రీసెర్చ్లో మనం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తున్నామని చెప్పారు.
'నార్కో టెర్రర్' విసిరే సవాళ్లను సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు, నార్కో టెర్రర్ను దేశంలోకి అడుగుపెట్టనీయకుండా చేయడానికి కేంద్ర కృతనిశ్చయంతో ఉందని అమిత్షా తెలిపారు. నార్కో టెర్రర్ గుప్పిట్లోకి దేశం చిక్కకుండా చూడటం, నిలువరించడం కీలకమని చెప్పారు. ఇన్వేస్టిగేషన్ వేగవంతంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు శాస్త్రీయ పరికరాలను అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ''ఇది థర్డ్ డిగ్రీ శకం కాదు. క్రిమినల్ జస్టిస్ సిస్టంతో ముందుకు వెళ్లాలి. ఇందులో ఫోరెన్సిక్ సైన్సెస్ పాత్ర చాలా కీలకం. శాస్త్రీయ సాక్ష్యాలను ఆధారం చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ ఉండాలి'' అని హోం మంత్రి అన్నారు.