భారత్‌ గ్యాస్‌ సబ్సిడీ ప్రశ్నార్థకం!

ABN , First Publish Date - 2021-03-30T07:16:00+05:30 IST

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) సరఫరా చేస్తున్న వంట గ్యాస్‌ ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ ప్రశ్నార్థకంగా మారింది

భారత్‌ గ్యాస్‌ సబ్సిడీ ప్రశ్నార్థకం!

ఉజ్వల ఉచిత గ్యాస్‌ సరఫరా కూడా

ప్రైవేటీకరణ నేపథ్యమే కారణం?

కొనసాగింపుపై త్వరలో కేబినెట్‌ నిర్ణయం


న్యూఢిల్లీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) సరఫరా చేస్తున్న వంట గ్యాస్‌ ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ధరలు ఎంతగా పెరిగినా.. మూల ధర ఒకేలా ఉంటూ సబ్సిడీ మొత్తం పెరిగేది. ఏడాది కాలంగా గ్యాస్‌ బండ ధర పెరుగుతున్నా రూ.40.72 మాత్రమే సబ్సిడీ రూపంలో వినియోగదారుల ఖాతాల్లో పడుతోంది. అయితే.. బీపీసీఎల్‌లో ఇకపై ఆ సబ్సిడీ కూడా కొనసాగబోదనే సంకేతాలు వస్తున్నాయి. ప్రైవేటీకరణే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ బీపీసీఎల్‌లో వేగవంతంగా కొనసాగుతోంది. అయితే, ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఉన్న నేపథ్యంలో దానిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈ సంస్థను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రైవేటు కంపెనీలు కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. దాంతో ప్రైవేటీకరణ తర్వాత సబ్సిడీని కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి. బీపీసీఎల్‌ ప్రైవేటీకరణకు ఆర్థిక బిడ్‌లను ఆహ్వానించేలోపే సబ్సిడీపై తాము నిర్ణయం తీసుకుంటామని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రకటించారు. 


కేంద్ర ప్రభుత్వ చర్చల్లో భాగంగా ప్రైవేటీకరణ తర్వాత కూడా కొన్నేళ్లపాటు సబ్సిడీని కొనసాగించాలని ప్రతిపాదించామని పెట్రోలియం శాఖ వర్గాలు తెలిపాయి. దీనిపై ఇప్పటికే కేబినెట్‌ నోట్‌ను సిద్ధం చేశామని, త్వరలో కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏడాదికి రూ.10 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారికి గ్యాస్‌ సబ్సిడీ కింద నగదు బదిలీ చేస్తున్నారు. దాంతో పాటు ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉచిత గ్యాస్‌ సరఫరా కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. బీపీసీఎల్‌ను కొనడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రైవేటు కంపెనీలు మాత్రం సబ్సిడీపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది. ‘‘పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై ఇప్పుడు నియంత్రణ లేదు. ప్రభుత్వ సంస్థను కొనుగోలు చేసిన వారు తమకుతాముగా ధరలను ఖరారు చేసుకుంటారు. ఈ అంశంలో ప్రభుత్వం లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు’’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-03-30T07:16:00+05:30 IST